Etela Rajender: సీఎం కేసీఆర్పై బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్లలో ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని నిలదీశారు. హుజురాబాద్, మునుగోడు ఎన్నికల్లో ఖర్చు చేసిన వందల కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు.
Etala Rajender: సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తన పోరాటం సాగుతుందని అన్నారు. బీజేపీ పార్టీ.. దేశంలోనే బలమైన పార్టీ అని, ఆ పోరాటాన్ని ఎదుర్కోవడం కేసీఆర్ వల్ల కాదన్నారు. తెలంగాణ ప్రజల కోసం.. తన పోరాటం సాగుతుందని ఈటల రాజేందర్ తెలిపారు.
ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరించి.. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్పూర్ గ్రామ సర్పంచ్ నేరేళ్ళ మహేందర్ గౌడ్, వార్డు మెంబర్ మహ్మద్ ఇబ్రహీమ్ పై అక్రమంగా కేసులు పెట్టారనీ, సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు నడుచుకుంటున్నారని మండిపడ్డారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా హింసించిన హుజురాబాద్ సీఐ బొల్లం రమేష్ పై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని, పొలీసులు బీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
బీజేపీ నాయకులు,కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి.. వారిని పోలీసుల వేధిస్తున్నారనీ, అలాంటి చర్యలు మానుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో పోలీసుల వేధింపులు ఆపకుంటే.. గ్రామస్థాయిలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈటల రాజేందర్ ఇంకా మాట్లాడుతూ.. వేల ఎకరాల భూమి ఉన్నోడికి రైతు బందు ఎలా ఇస్తావన్నందుకు మెడలు పట్టి బయటకు వెల్లగొట్టాడని పేర్కొన్నారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలను తీర్చడంలో విఫలమయ్యారనీ, డబుల్ బెడ్ రూమ్, మూడెకరాల భూమి, దళిత బందు పూర్తిగా ఇవ్వలేదని విమర్శించారు. దళిత బిడ్డలకు 10లక్షల రూపాయలు పంచే వరకు తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టవద్దని అన్నారు. ఇటీవల మునుగోడులో గిరిజన బందు అన్నాడని, కానీ, ఇంత వరకు జీ.ఓ కూడా విడుదల చేయలేదని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ దళిత బిడ్డల అందరికీ దళిత బందు రాకపోతే కేసీఆర్ భరతం పడతామని ఈటల రాజేందర్ హెచ్చరించారు. చదువుకున్న వారికి ఉద్యోగం వస్తుందని భావిస్తే.. ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయని తెలిపారు.
పేపర్ లీకేజీపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా.. వెంటనే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే.. అహంకార పూరితంగా వ్యవవహరించిన సీఐని సస్పెండ్ చేయాలని, సీఐని సస్పెండ్ చేసే వరకు ధర్నా కొనసాగుతోందని తేల్చి చెప్పారు. ఇదే తరుణంలో 8 ఏళ్లలో ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఖర్చు చేసిన వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు.