ఇసుక క్వారీలతో కోట్లు కొల్లగొడుతున్నారు: కేసీఆర్‌పై ఈటల రాజేందర్ ఫైర్

By narsimha lodeFirst Published Apr 16, 2023, 1:55 PM IST
Highlights

తమ పార్టీ కార్యకర్తలపై   అక్రమ కేసులను  నిరసిస్తూ  మాజీ మంత్రి  ఈటల రాజేందర్   ఇవాళ హూజూరాబాద్  అంబేద్కర్  విగ్రహం వద్ద ధర్నాకు దిగారు.  


కరీంనగర్: హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో  రూ.  600 కోట్లను   బీఆర్ఎస్ ఖర్చు చేసిందని  మాజీ మంత్రి  ఈటల రాజేందర్  ఆరోపించారు.తమ పార్టీ కార్యకర్తలపై  అక్రమ అరెస్టులను  నిరసిస్తూ   హుజూరాబాద్  అంబేద్కర్  చౌరస్తాలో  మాజీ మంత్రి ఈటల రాజేందర్  ఆదివారంనాడు  ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా  ఈటల  రాజేందర్  మాట్లాడారు.  ఇసుక  క్వారీలకు  కేసీఆర్  తోడల్లుడికి కట్టబెట్టి  కోట్లు కొల్లగొట్టారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. మానేరు నదిలో  ఇసుకను తరలించి  దోచుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన  సహజ సంపదను  దోచుకొని  అధికారపార్టీ నేతలు  దోచుకుంటున్నారని  ఆయన  ఆరోపించారు. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న హుజూరాబాద్ సీఐపై  చర్యలు తీసుకోవాలని  ఆయన డిమాండ్  చేశారు.  సీఐ పై  చర్యలు తీసుకొనేవరకు  పోరాటం కొనసాగిస్తామని  ఈటల రాజేందర్ ప్రకటించారు.  ఉపఎన్నికల్లో  బెదరనివారిపై  అక్రమ కేసులు బనాయిస్తున్నారని  ఈటల రాజేందర్  ఆరోపించారు. 


ఒక వేళ ప్రభుత్వం సి ఐకి అండగా ఉంటే ప్రభుత్వం గద్దె దిగెంతవరకు పోరాడుతామని  మాజీ మంత్రి ఈటల రాజేందర్  చెప్పారు.  కేసీఆర్ దుర్మార్గాలను ప్రశ్నిస్తే   పదవులు వచ్చయాని స్థానిక బీఆర్ఎస్ నేతలనుద్దేశించి  ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.  .డబుల్ బెడ్ రూం లు వద్దు స్థలాలు ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వమని  తాను  గతంలో  కేసీఆర్ కు  చెప్పినట్టుగా  ఈటల రాజేందర్ గుర్తు  చేశారు.  

రైతు బంధు కింద   వేల ఎకరాలు ఉన్న వాళ్లకు రైతు  బంధు ఎందుకని  తాను  ప్రశ్నించినందుకు  తనను  బీఆర్ఎస్ నుండి బయటకు  పంపారన్నారు.  హుజూరాబాద్ ప్రజలు ఆత్మను చంపుకొలేదన్నారు.   డబ్బు సంచులకు అమ్ముడు పోలేదని  చెప్పారు. 
హుజూరాబాద్  ఎన్నికల్లో పెట్టిన పైసలు ఇసుక తరలించుకుంటూ సంపాదించుకుంటున్నారని  కేసీఆర్ పై  ఆరోపణలు  చేశారు. 
తెలంగాణ  ఉద్యమం జరిగేటప్పుడు లేని డబ్బులు ఈ తొమ్మిది సంవ్సరాలుగా ఎక్కడి నుండి వచ్చాయని  ఆయన  కేసీఆర్ ను  ప్రశ్నించారు. 

తెలంగాణ డబ్బులు ఇతర రాష్ట్రాలకు ఎలా పంపుతారని  ఈటల రాజేందర్  ప్రశ్నించారు. ప్రాణాలకు వెల కట్టే మూర్ఖపు నాయకుడు కేసీఆర్ అని  ఆయన మండిపడ్డారు.  
హుజూరాబాద్ లో 3500 కుటుంబాలకు ఇంకా దళిత బందు రాలేదన్నారు.  పేదరికానికి కులం తో సంబంధం లేదన్నారు. దళితులందరికి  దళితబంధు  ఇవ్వాలని డిమాండ్  చేశారు.  దళిత బందు రెండో విడత డబ్బులు కూడా ఇంకా రాలేదన్నారు.  

సిరిసిల్ల లో నిరుద్యోగులకు న్యాయం చేయమని అడిగితే కొట్టి జైల్లో  పెడుతున్నారని  ఆయన  విమర్శించారు. పేపర్ లీక్ చేసిన టీఎస్‌పీఎస్‌సీ అధికారులపై చర్యలు తీసుకోవాలని  ఈటల రాజేందర్ డిమాండ్  చేశారు.  రాష్ట్రం లో అనేక మంది సర్పంచ్ లు అప్పుల ఉబిలో కూరుకుపోయారన్నారు.  హైదరాబాద్ చుట్టూ పక్కన ఉన్న 5800 ఎకరాలు ఆక్రమించుకున్న చరిత్ర కేసీఆర్ దని  ఈటల రాజేందర్   ఆరోపించారు. 

అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ధర్నా ప్రారంభించారు  ఈటల రాజేందర్. చెల్పూర్ గ్రామ సర్పంచ్ నేరేళ్ళ మహేందర్ గౌడ్, వార్డు మెంబర్ మహ్మద్ ఇబ్రహీమ్ పై అక్రమంగా  పోలీసులు కేసు పెట్టారని  బీజేపీ ఆరోపించింది.  

ఈ కేసులో  అరెస్టు  చేసిన  ఈ ఇద్దరిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన  పోలీసులపై  చర్యలు తీసుకోవాలని  ఈటల రాజేందర్   డిమాండ్  చేశారు.  ఎన్ని ప్రలోభాలు  పెట్టినా  తనను నమ్ముకుని  ఉన్న క్యాడర్ ను  అధికార పార్టీ నేతలు  ఇబ్బందులు పెడుతున్నారని  ఈటల రాజేందర్  విమర్శించారు.   ఈ ధర్నాలో మాజీఎమ్మెల్యే బొడిగే శోభ, కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 
 

click me!