జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్ధం పుచ్చుకున్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు

By Siva KodatiFirst Published Aug 25, 2022, 9:54 PM IST
Highlights

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరారు. ఢిల్లీ వెళ్లిన ఆయన జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. 

టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు భారతీయ జనతా పార్టీలో చేరారు. తన అనుచరులతో కలిసి గురువారం ఢిల్లీ వెళ్లిన ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావును నడ్డా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

కాగా.. ఈ నెల 7న ప్రదీప్ రావు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన కంటతడిపెట్టారు. తెలంగాణ ఉద్యమం కోసం తాను పనిచేసినట్టుగా చెప్పారు. బంగారం తెలంగాణ సాధన కోసం తాను అనేక త్యాగాలు చేసినట్టుగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా తాను టీఆర్ఎస్ బలోపేతం కోసం పనిచేసినట్టుగా ప్రదీప్ రావు వెల్లడించారు. 

ALso Read:షాక్: ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్ కు రాజీనామా

తన సహకారం లేకుండానే నరేందర్ రావు ఎమ్మెల్యేగా విజయం సాధించినట్టుగా చెబుతున్నారని.. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన మద్దతు లేకుండా విజయం సాధించాలని ప్రదీప్ రావు సవాల్ విసిరారు. ఈ నెల 10వ తేదీ లోపుగా తన సవాల్‌ను స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. నరేందర్ స్పందన కోసం తాను ఎదురు చూస్తున్నట్టుగా చెప్పారు. నరేందర్ స్పందన వచ్చిన తర్వాతే తానే ఏదైనా పార్టీలో చేరుతానని ప్రదీప్ రావు స్పష్టం చేశారు. తాను పార్టీలోనే ఉన్న సమయంలోనే కోస్తా, చీరుస్తా అని నరేందర్ రావు బెదిరింపులకు పాల్పడ్డారని  ప్రదీప్ రావు ఆరోపణలు చేశారు. వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 4 వేల కోట్ల అభివృద్ది పనులకు ఖర్చు చేసినట్టుగా ఎమ్మెల్యే చెబుతున్నారని... కానీ ఆ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారో చూపించాలని ప్రదీప్ రావు డిమాండ్ చేశారు. 
 

click me!