కేసీఆర్‌కి ఈసీ షాక్: హుజూరాబాద్‌లో దళితబంధు‌కి బ్రేక్

By narsimha lodeFirst Published Oct 18, 2021, 7:55 PM IST
Highlights


హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు దళిత బంధును నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.ఈ నెల 30వ తేదీన  హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.

హుజూరాబాద్: హుజూరాబాద్‌ లో దళితబంధుకు బ్రేక్ పడింది. ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు దళితబంధు పథకాన్ని నిలిపివేయాలని ఈసీ నిర్ణయం తీసుకొంది.దళితబంధు పథకంపై అందిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకొంది..ఉప ఎన్నిక నేపథ్యంలో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని సీఈసీ ఆదేశించింది.ఎన్నికల కోడ్‌ అమలులో ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఉపఎన్నిక తర్వాత దళితబంధును యథావిథిగా కొనసాగించవచ్చని సూచించింది.Huzurabad bypollలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఈ పథకాన్ని అధికార పార్టీ ఉపయోగించుకొంటుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

also read:Huzurabad bypoll: ఈసీపై మండిపడ్డ మాణికం ఠాగూర్

ఈ విషయమై బీజేపీనేతలతో పాటు హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొందరు  Election commission ఫిర్యాదు చేశారు.ఈ పిర్యాదుపై విచారణ నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం Dalitha Bandhu పథకాన్ని ఉప ఎన్నిక ముగిసే వరకు  నిలిపివేయాలని ఆదేశించింది. దళితబంధు పథకాన్ని ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.

 హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళితబంధు అమలు కాకుండా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ తో పాటు హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారికి కూడ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోయల్ సోమవారం నాడు ఆదేశించారు.

దళితబంధు పథకాన్ని ఇదే అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఏడాది ఆగష్టు 16న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ఎన్నికలను పురస్కరించుకొనే తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందని విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ పథకం కోసం ఏడాదిన్నర కాలంగా కసరత్తు చేస్తున్నామని కేసీఆర్ విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు.

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని ఎంపిక చేసిన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితబంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు  దళితులతో పాటు బీసీ, ఈబీసీలకు కూడా ఇదే తరహాలో పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్  ప్రకటించారు.ఈ నెల 30వ తేదీన హుజూరాబాద్ అసెంబ్లీ  స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నాయి.వచ్చేనెల 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.ఎన్నికలు జరగడానికి 12 రోజుల ముందు ఈ పథకానికి బ్రేక్ వేసింది ఈసీ.

దళిత వ్యతిరేకులే ఫిర్యాదు: టీఆర్ఎస్

దళితబంధు పథకంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై టీఆర్ఎస్ స్పందించింది. దళిత వ్యతిరేక పార్టీలు ఈ విషయమై ఈసికి ఫిర్యాదు చేసి ఈ పథకాన్ని నిలిపివేసేలా చేశారని ఆ పార్టీ అభిప్రాయపడింది. దళితులు ఆర్ధికంగా సహాయం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను  దళిత వ్యతిరేకులు అడ్డుకొంటున్నారని టీఆర్ఎస్ అభిప్రాయపడింది.


 

 

click me!