ఇబ్రహీంపట్నం ఘటన : విచారణకు హాజరుకాని డాక్టర్ సునీల్ జోయల్, రెండు చోట్లా డుమ్మా

By Siva KodatiFirst Published Sep 2, 2022, 9:39 PM IST
Highlights

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం నియమించిన కమిటీ ముందు డాక్టర్ సునీల్ జోయల్ విచారణకు గైర్హాజరయ్యారు. 

ఆగస్ట్ 27న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న వారిలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అవ్వడమే కాకుండా శాఖపరమైన విచారణకు ఆదేశించింది. దీనికి సంబంధించి రిటైర్డ్ సర్జన్ డాక్టర్ సునీల్ జోయల్ విచారణకు గైర్హాజరయ్యారు. కు.ని ఆపరేషన్‌లలో జోయల్ కీలకంగా వ్యవహరించడంతో అధికారులు ఆయనను శుక్రవారం విచారణకు పిలిచారు. అయితే ఇబ్రహీంపట్నం ఆసుపత్రితో పాటు కోఠిలోని డీహెచ్ ఆఫీస్‌లో జరిగిన విచారణలకు జోయల్ హాజరుకాలేదు. కేవలం క్యాంప్‌లో పాల్గొన్న సిబ్బందిని విచారించిన డీహెచ్ శ్రీనివాసరావు ఆడియో, వీడియో స్టేట్మెంట్ రికార్డు చేశారు. అయితే జోయల్ మాత్రం ఎంతకీ రాకపోవడంతో కమిటీ సభ్యులు వెళ్లిపోయారు. 

అంతకుముందు ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీ‌లో డీహెచ్ శ్రీనివాస్ రావు నేతృత్వంలోని శుక్రవారం పర్యటించింది. ఇటీవల ఇబ్రహీపట్నం సీహెచ్‌సీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న నలుగురు మహిళలు మృతిచెందడం తీవ్రకలకం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై డీహెచ్‌‌ను విచారణాధికారిగా నియమించింది. వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే డీహెచ్ శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం ఇబ్రహీంపట్నం ఆస్పత్రిని సందర్శించింది. ఆస్పత్రిలో ఆపరేషన్ చేసిన గది, పరికరాలను ఈ బృందం పరిశీలించింది. 

ALso REad:కారణమిదీ: ఇబ్రహీంపట్నంలో కు.ని. శస్త్రచికిత్స తర్వాత నలుగురు మహిళల మృతి

అనంతరం డీహెచ్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. ఆస్పత్రులతో చికిత్స పొందుతున్న 30 మంది మహిళల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. నిన్న ఒక్కరిని డిచార్జ్ చేసినట్టుగా తెలిపారు. ఈ రోజు మరో 11 మందిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుందన్నారు. మరో 18 మందిని వైద్యుల పర్యవేక్షణ అనంతరం  రానున్న రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్టుగా చెప్పారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగిన రోజు విధుల్లో ఉన్న సిబ్బందిని పూర్తిగా విచారించడం జరిగిందన్నారు. రానున్న ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందన్నారు. 

ఆగస్టు 25వ తేదీన ఆపరేషన్ చేసిన తర్వాత పూర్తి ఆరోగ్యం ఉన్నారని నిర్దారించుకున్న తర్వాతే సాయంత్రానికి డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. నలుగురు మహిళల మరణాలకు కారణాలేమిటనేది తెలియాల్సి ఉందన్నారు. అన్ని కోణాల్లో ఇందుకు సంబంధించి విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఆస్పత్రిలో వాడిన పరికరాలను ల్యాబ్ పంపించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 
 

click me!