మద్యం అమ్మకాలు: మోడీ కిటికీలు తెరిస్తే... కేసీఆర్ తలుపులే తెరిచారంటూ చాడ ఫైర్

By Siva KodatiFirst Published May 6, 2020, 9:37 PM IST
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఫైరయ్యారు. ప్రభుత్వానికి ఆదాయంపై ఉన్న ఆసక్తి ప్రజల యోగక్షేమాలపై లేదని ఆయన విమర్శించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఫైరయ్యారు. ప్రభుత్వానికి ఆదాయంపై ఉన్న ఆసక్తి ప్రజల యోగక్షేమాలపై లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలు తెరిస్తే... లాక్‌డౌన్ ఉన్నా ప్రయోజనం ఏంటని వెంకటరెడ్డి ప్రశ్నించారు.

సంక్షేమ పథకాల పేరుతో  ప్రజలకు ఒక చేత్తో డబ్బులు ఇచ్చి.. మద్యం అమ్మకాల ద్వారా మరో చేత్తో వెనక్కి తీసుకోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలను కించపరిచేలా మాట్లాడటం మంచి పద్ధతి కాదని చాడ హితవు పలికారు.

Also Read:తెలంగాణలో కొనసాగుతున్న తగ్గుదల: ఇవాళ 11 కేసులు... అన్ని హైదరాబాద్‌ పరిధిలోనే

ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాయని, ప్రజల ఆవేదనను తమ గొంతు ద్వారా వినిపిస్తాయని చాడ అన్నారు. కరోనా పట్ల ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాయని... ప్రధానమంత్రి కొంత వెసులుబాటుతో కిటికీలు తెరిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా తలుపులనే తెరిచారని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.

రైతులకు రూ.25 వేల వరకు ఉన్న రుణమాఫీకి తక్షణమే నిధులు విడుదల చేస్తామని చెప్పడాన్ని చాడ స్వాగతించారు. రాష్ట్రంలో బుధవారం నుంచి మద్యం షాపులకు అనుమతిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

కేంద్రం ఇచ్చిన సడలింపులతో 4 రాష్ట్రాలు మద్యం దుకాణాలు తెరిచాయని .. తెలంగాణకు ఏపీ, మహారాష్ట్రతో సుధీర్ఘ సరిహద్దు ఉందని కేసీఆర్ చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరిచాయని... సరిహద్దు గ్రామాల ప్రజలు అక్కడికెళ్లి మద్యం తాగుతున్నారని సీఎం తెలిపారు. రాను రాను మద్యం స్మగ్లింగ్ తయారవుతుందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

మద్యం దుకాణాలు తెరవాలని కేబినెట్ నిర్ణయించిందని .. రెడ్ జోన్ జిల్లాలో కూడా మద్యం షాపులు తెరుస్తారని కేసీఆర్ తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్‌లో మాత్రం మద్యం దుకాణాలు ఓపెన్ కావని స్పష్టం చేశారు.

Also Read:మందుబాబులకు గుడ్ న్యూస్: మద్యం అమ్మకాలకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్

మద్యం రేటు 16 శాతం పెంచుతున్నామని... బార్లు, పబ్‌లు, క్లబ్‌లకు అనుమతి లేదని, భౌతిక దూరం పాటించకపోతే క్షణాల్లో షాప్ సీజ్ చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. 

చీప్ లిక్కర్‌పై మాత్రం 11 శాతం పెంచుతున్నామని.. మాస్కులు లేకపోతే మద్యం ఇవ్వరని, లాక్‌డౌన్ తర్వాత కూడా ఇవే రేట్లు కొనసాగుతాయని సీఎం పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు నిర్వహించుకోవచ్చునని కేసీఆర్ వెల్లడించారు.

click me!