కాలినడకన భార్యాపిల్లలతో సొంతూరికి: వూళ్లోకి రానివ్వని గ్రామస్తులు, 10 రోజులుగా గుడిలోనే

By Siva KodatiFirst Published May 10, 2020, 9:22 PM IST
Highlights

కరోనా కారణంగా ఉపాధి లేక, తినడానికి తిండి లేక వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చేసేదిలేక భార్యాబిడ్డలతో కలిసి కాలినడకనో, సైకిల్‌ మీదనో స్వస్థలాలకు బయల్దేరారు. ఎంతో కష్టపడి సొంతూరుకు వెళితే... కరోనా భయంతో గ్రామస్తులు వారిని వూళ్లోకి రానివ్వడం లేదు

లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. పొట్టకూటి కోసం అయినవాళ్లను, కన్నతల్లి లాంటి వూరిని విడిచిపెట్టి దేశంలోని వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లారు. అయితే కరోనా కారణంగా ఉపాధి లేక, తినడానికి తిండి లేక వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దీంతో చేసేదిలేక భార్యాబిడ్డలతో కలిసి కాలినడకనో, సైకిల్‌ మీదనో స్వస్థలాలకు బయల్దేరారు. ఎంతో కష్టపడి సొంతూరుకు వెళితే... కరోనా భయంతో గ్రామస్తులు వారిని వూళ్లోకి రానివ్వడం లేదు.

Also Read:తెలంగాణలో మళ్లీ కలకలం: వరుసగా రెండో రోజూ 30కి పైగా కేసులు, 1,196కి చేరిన సంఖ్య

ఖమ్మం జిల్లాలో ఓ కుటుంబానికి ఇదే పరిస్ధితి ఎదురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కొమురారం గ్రామానికి చెందిన భాస్కర్ అనే వ్యక్తి కుటుంబం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లింది. అక్కడ 8 ఏళ్లుగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

లాక్‌డౌన్ కారణంగా జీవనోపాధి ఇబ్బందిగా మారడంతో భార్యాపిల్లలను తీసుకుని దాదాపు నాలుగు రోజుల పాటు నడిచి ఖమ్మం చేరుకున్నారు. బంధువుల సూచన మేరకు అక్కడే కోవిడ్ 19 పరీక్షలు చేసుకోగా, నెగిటివ్ రావడంతో స్వగ్రామం కొమురారంకు బయల్దేరారు.

Also Read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: భుజాలపై కూతురితో 900 కి.మీ నడిచిన తల్లి

అయితే ఊరికి వెళ్లిన వారిని గ్రామస్తులు, బంధువులు వూళ్లోకి రాకుండా అడ్డుకున్నారు. కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని వినిపించుకోకుండా బయటకు వెళ్లగొట్టారు. దీంతో చేసేదేమీ లేక సుమారు 10 రోజుల నుంచి ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలోని దేవాలయంలో ఆశ్రయం ఉంటున్నారు. 
 

click me!