
హింస, ద్వేషాన్ని రూపు మాపడమే భారత్ జోడో యాత్ర లక్ష్యమన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఆయన నిర్వహిస్తున్న పాదయాత్ర హైదరాబాద్కు చేరకుంది. ఈ సందర్భంగా గురువారం గుడిగండ్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో మోడీ, తెలంగాణలో కేసీఆర్లు అధికారంలో వున్నారన్నారు. తమిళనాడులో ప్రారంభమైన జోడో యాత్ర ఇవాళ తెలంగాణలో కొనసాగుతోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పార్లమెంట్లో బీజేపీ ఏ బిల్లు పెట్టినా తూచా తప్పకుండా టీఆర్ఎస్ మద్ధతు ఇచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు.
రైతు వ్యతిరేక చట్టాలకు టీఆర్ఎస్ మద్ధతు ఇచ్చిందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని ఆయన ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు కాంగ్రెస్ సమదూరం పాటిస్తుందని రాహుల్ స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ అంటకాగుతున్నాయని.. రెండు పార్టీలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. రెండు పార్టీలు శాసనసభ్యులను కొనుగోలు చేస్తూ రాజకీయాలను భ్రష్టు పట్టించాయని, టీఆర్ఎస్ పార్టీ మియాపూర్ లాండ్ స్కామ్కు పాల్పడిందని రాహుల్ ఆరోపించారు.
ALso Read:తెలంగాణలో అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు:రైతుల సమావేశంలో రాహుల్
కాళేశ్వరం ప్రాజెక్ట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై రైతులు , సామాన్యులు పెద్దఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారని.. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ప్రజా సంక్షేమాన్ని చూడకుండా వారి సొమ్ము దోచుకుంటోందని ... నిరుద్యోగ సమస్య రోజురోజుకి పెరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో పేదలు, సామాన్యులు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉపాధి, ఉద్యోగాల కోసం యువత ఎదురుచూస్తోందని రాహుల్ అన్నారు. నిరుద్యోగం, పెట్రోలు , గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను ఎలుగెత్తి చాటడానికే జోడో యాత్ర చేపట్టానని రాహుల్ తెలిపారు.
అంతకుముందు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు, కౌలు రైతులతో రాహుల్ గాంధీ సమావేశమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి రైతులు రాహుల్ గాంధీతో సమావేశానికి హాజరయ్యారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై తమ పార్టీ ఒత్తిడి తీసుకువస్తుందని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ ను అమలు చేస్తామన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఆర్ధిక సహాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.కౌలు రైతుల సమస్యలకు కూడా పరిష్కారం చూపుతామన్నారు.