
నల్గొండ జిల్లా నకిరేకల్లో హోలీ వేడుకల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. హోలీ వేడుకలకు సంబంధించి అధికార బీఆర్ఎస్కు చెందిన ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. హోలీని పురస్కరించుకుని నకిరేకల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పోటాపోటీగా వేడుకలను నిర్వహించారు. అయితే తమను హోలీ సంబరాలు నిర్వహించకుండా చిరుమర్తి లింగయ్య వర్గీయులు అడ్డుకుంటున్నారని వేముల వీరేశం వర్గీయులు ఆరోపించారు. పోలీసులు చిరుమర్తి వర్గీయులకు డీజేకు పర్మిషన్ ఇచ్చి తమకు ఇవ్వడం లేదని చెప్పారు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యే చిరుమర్తి వర్గీయులు, పోలీసుల తీరుపై వీరేశం వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకిరేకల్లో ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటున్నారు. దీంతో నకిరేకల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా కాలంగా చిరుమర్తి, వీరేశం మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో ఈ విభేదాలు బహిర్గతం అయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన చిరుమర్తి లింగయ్య.. ఆ తర్వాత కొన్ని నెలలకే బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చిరుమర్తి లింగయ్య, వేముల వీరేశం గ్రూప్లు కొనసాగుతున్నాయి.