ప్రధాని మోడీని కలిసిన చినజీయర్ స్వామి... రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం

By Siva KodatiFirst Published Sep 18, 2021, 7:16 PM IST
Highlights

త్రిదండి శ్రీరామన్నారాయణ చినజీయర్ స్వామిజి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. భగవత్‌ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు అతిరథ మహారథులను ఆహ్వానించడం కోసం త్రిదండి చిన్నజీయర్‌ స్వామి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మోడీకి  ఆహ్వానపత్రికను అందించారు.

త్రిదండి శ్రీరామన్నారాయణ చినజీయర్ స్వామిజి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. భగవత్‌ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు అతిరథ మహారథులను ఆహ్వానించడం కోసం త్రిదండి చిన్నజీయర్‌ స్వామి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మోడీకి  ఆహ్వానపత్రికను అందించారు. సహస్రాబ్ది మహోత్సవాల విశిష్టతను మోదీకి వివరించారు స్వామిజీ. దాదాపు 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని ప్రధానిని కోరారు.

చిన్నజీయర్‌ స్వామితో పాటు మైహోం గ్రూప్‌ అధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు కూడా మోదీని కలిసి ప్రాజెక్టు విశేషాలను వివరించారు. సమతాస్ఫూర్తి కేంద్రం విశిష్టతను, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ప్రతిబింబంగా ఏర్పాటు చేయనున్న 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ విశిష్టతను, అక్కడ కొలువుదీరనున్న 108 దివ్యదేశాల వివరాలను మోదీ ఆసక్తిగా తెలుసుకున్నారు. ప్రపంచ శాంతి కోసం చిన్న జీయర్ స్వామి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందించిన ప్రధాని మోడీ.. విగ్రహ ఆవిష్కరణకు తప్పక వస్తానని హామీ ఇచ్చారు. 

రామానుజాచార్య పంచలోహ విగ్రహం కొలువుదీరుతుండడంతో శంషాబాద్‌‌లోని ముచ్చింతల్‌ ప్రాంతం ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా కొత్త రూపును సంతరించుకోనుంది. విగ్రహావిష్కరణ మహోత్సవానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, భారత ప్రధాన న్యాయమూర్తి.. ఇలా మహామహులంతా తరలి వస్తుండడంతో భాగ్యనగరం ప్రత్యేక శోభను సంతరించుకోనుంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకూ ఈ మహోత్సవం జరగనుంది. విశ్వనగరంగా ఇప్పటికే  పేరుపొందిన హైదరాబాద్‌కు ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఈ మహోత్సవం గుర్తింపు తేనుంది.

click me!