
హైదరాబాద్: Hyderabad నగరంలోని Meena Jewellers సంస్థపై CBI కేసు నమోదు చేసింది. బ్యాంకుల నుండి రుణాలు ఎగ్గొట్టారని SBI అధికారులు ఫిర్యాదులు చేయడంతో సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. మీనా జ్యుయలర్స్ సంస్థకు చెందిన డైరెక్టర్ ఉమేష్ జైత్వానీపై కూడా కేసులు నమోదయ్యాయి.
ఎస్బీఐ ఆధ్వర్యంలోని కన్సార్టియం నుండి 364.2 కోట్ల రుణం తీసుకుని మోసం చేశారని సీబీఐకి బ్యాంకుల నుండి ఫిర్యాదులు అందాయి. 2015 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కంపెనీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది. మీనా జువెల్లర్స్ డైమండ్ ప్రైవేట్ లిమిటెడ్, మీనా జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మీనా జువెల్లర్స్ ఎక్స్క్లూజివ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు బ్యాంకుల నుంచి రుణాలు పొందాయి.
ఈ కంపెనీల ప్రస్తుత ఓనర్లతో పాటు పాత ప్రమోటర్లు కూడా తీసుకున్న రుణాలకు ఖాతాలను చూపలేకపోయారు. 2016 నుంచి 2020 మధ్యకాలంలో మీనా జువెల్లర్స్ ,డైమండ్స్ కంపెనీ రూ. 810 కోట్ల విలువైన లావాదేవీలను నిర్వహించిందని, అయితే బ్యాంకుల్లో కేవలం రూ. 70 కోట్లు మాత్రమే జమ చేసిందని బ్యాంకులు అంటున్నాయి.
మీనా జువెల్లర్స్ ఎక్స్క్లూజివ్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా రూ. 884 కోట్ల విలువైన లావాదేవీలను నిర్వహించిందని అయితే బ్యాంకుల్లో కేవలం రూ.70 కోట్లు మాత్రమే చూపిందని బ్యాంకులు అంటున్నాయి. ఈ విషయమై మూడు కేసులను సీబీఐ నమోదు చేసింది.