కోరుట్లలో ఘోరం... నడిరోడ్డుపై బిఆర్ఎస్ కౌన్సిలర్ భర్త దారుణ హత్య

By Arun Kumar PFirst Published Aug 8, 2023, 4:08 PM IST
Highlights

కోరుట్లలో పట్టపగలే అందరూ చూస్తుండగానే ఇద్దరు దుండుగుల బిఆర్ఎస్ కౌన్సిలర్ భర్తపై కత్తితో దాడిచేసి చంపేసారు. 

జగిత్యాల : అధికార బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ భర్తపై కొందరు దుండగులు కత్తులతో దాడిచేసి హత్యకు పాల్పడ్డారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బైక్ వచ్చిన ఇద్దరు దుండుగులు కౌన్సిలర్ భర్తను కత్తితో పొడిచి పరారయ్యారు.  

కోరుట్ల పట్టణంలోని 9వ వార్డు కౌన్సిలర్ పోగులు ఉమారాణి భర్త పోగుల లక్ష్మిరాజ్యం బిఆర్ఎస్ నాయకుడు. సోమవారం అతడు కార్గిల్ చౌరస్తాలోని ఓ హోటల్లో టీ  తాగుతుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై అక్కడికి వచ్చారు. వస్తూనే బైక్ పై నుండి దిగిన  ఒకడు నేరుగా లక్ష్మీరాజ్యం వద్దకు వెళ్ళి మెడపై కత్తితో దాడిచేసాడు. తీవ్ర రక్తస్రావంతో అతడు కిందపడిపోగానే ఇద్దరు దుండగులు పరారయ్యారు. 

దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీరాజ్యంను కుటుంబసభ్యులు కరీంనగర్ హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావమై పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

Read More  హైదరాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. బస్సులోకి ప్రవేశించి చితకబాదిన యువకులు.. (వీడియో)

బిఆర్ఎస్ నాయకుడిపై దాడి విషయం తెలిసిన వెంటనే డిఎస్పీ రవీందర్ రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. లక్ష్మీరాజ్యంపై దాడి సమయంలో అక్కడేవున్న ప్రత్యక్ష సాక్షుల నుండి వివరాలు సేకరించారు. కౌన్సిలర్ ఉమారాణితో పాటు కుటుంబసభ్యులను కూడా ఎవరిపై అయినా అనుమానం వుందేమోనని ఆరాతీసారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

అధికార పార్టీ నేత లక్ష్మీరాజ్యం హత్యతో కోరుట్లలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ హత్య వెనక రాజకీయ కారణాలేమైనా వున్నాయేమో అన్న కోణంలోనూ విచారణ సాగుతోంది. నిందితులను త్వరలోనే గుర్తించి కఠినంగా శిక్షిస్తామని పోలీసులు చెబుతున్నారు. 
 

click me!