
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ, ఈడీ సోదాల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ఇది టీఆర్ఎస్పై కక్ష సాధింపేనని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై బీజేపీ నేత, ఎమ్మెల్సీ రామచంద్రరావు స్పందించారు. అధికారులకు వున్న సమాచారంతోనే ఈడీ, ఐటీ సోదాలు జరుగుతూనే వున్నాయన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థలపై రాజకీయ ఒత్తిళ్లు వుండని రామచంద్రరావు పేర్కొన్నారు. ఐటీ, ఈడీ అధికారుల విధుల్లో భాగంగానే ఇలా చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని టీఆర్ఎస్ పెద్ద స్క్రిప్ట్ తయారు చేసి, సినిమా చూపించిందని రామచంద్రరావు దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే బీజేపీ ముందుకు సాగుతోందని.. ప్రజలు కూడా ఆదరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ALso REad:మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు: ఫోన్ స్వాధీనం, లాకర్ పగులగొట్టిన అధికారులు
కాగా... మంత్రి మల్లారెడ్డి ఇంట్లో మంగళవారం ఉదయం నుండి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్, ఆయన సోదరుడు గోపాల్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి , కొడుకులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, వియ్యంకుడు లక్ష్మారెడ్డి ఇళ్లలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కుటుంబానికి చెందిన 14 విద్యాసంస్థల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి ఫోన్ ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తన నివాసం పక్కనే ఉన్న క్వార్టర్ లో మల్లారెడ్డి పోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి సమక్షంలోనే ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.