
అన్ని పార్టీల కంటే ముందే మా అభ్యర్ధుల జాబితా వస్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు వాళ్లున్న పార్టీల్లో మనుగడ లేకే పార్టీలు మారతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దానిపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. నిర్మల్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని .. తక్షణమే 220 జీవో రద్దు చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
అంతకుముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలుస్తాయని ఆరోపించారు . తెలంగాణలో తూతూ మంత్రంగా రుణమాఫీ జరిగిందన్నారు. 9 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని.. ఇది అసమర్ధ ప్రభుత్వమన్నారు.
ALso Read: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయి : కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇకపోతే.. తెలంగాణపై బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. మూడు రాష్ట్రాల్లోని బీజేపీ ఎమ్మెల్యేలు రేపటి నుండి వారం రోజుల పాటు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై నివేదికను ఇవ్వనున్నారు. ఈ ఏడాది చివరలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని కమల దళం వ్యూహారచన చేస్తుంది.
ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి ఎమ్మెల్యేలు రేపు హైద్రాబాద్ కు రానున్నారు. హైద్రాబాద్ లోని పార్టీ కార్యాలయంలో వర్క్ షాప్ ను నిర్వహించనున్నారు. ఈ వర్క్ షాపు తర్వాత ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలను కేటాయించనున్నారు. తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పర్యటిస్తారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో ఎమ్మెల్యేలు పర్యటించి పార్టీపై క్షేత్రస్థాయి నివేదికను జాతీయ నాయకత్వానికి అందిస్తారు.