
Congress MP N. Uttam Kumar Reddy: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన చాలా నిరాశపరిచిందని అన్నారు. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపుతోందని ఆయన ఆరోపించారు.
వివరాల్లోకెళ్తే.. ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తెలంగాణలో పర్యటించడంపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ప్రారంభించిన చాలా ప్రాజెక్టులు చాలా ఏళ్ల క్రితమే ప్రకటించబడ్డాయనీ, అవి ఆలస్యమయ్యాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఈ జాప్యాన్ని అంగీకరించడానికి బదులుగా, మోడీ వాటిని కొత్త కార్యక్రమాలుగా పరిగణించారని విమర్శించారు. ఉదాహరణకు నాలుగేళ్ల క్రితం మంజూరైన బీబీనగర్ ఎయిమ్స్ ప్రాజెక్టు మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమైంది. ఆలస్యానికి క్షమాపణలు చెప్పడానికి బదులు పూర్తి గడువు ఇవ్వకుండానే ప్రధాని మోడీ మళ్లీ శంకుస్థాపన చేశారని మండిపడ్డారు.
బీబీనగర్ ఎయిమ్స్ కు 2018 డిసెంబర్ 17న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందనీ, ఈ ప్రాజెక్టుకు రూ.1,028 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.31.71 కోట్లు మాత్రమే విడుదల చేశారు. 2022 సెప్టెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి గడువును పలుమార్లు పొడిగించారు. అయితే ప్రస్తుత గడువుపై కేంద్రం మౌనం వహించిందని పేర్కొన్నారు. "బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణంలో 2019 నవంబర్ నుంచి 2021 డిసెంబర్ వరకు పలుమార్లు జాప్యం జరిగింది. జాప్యాన్ని కేంద్రం అంగీకరించి గడువు ఇచ్చినప్పటికీ కేటాయించిన నిధుల్లో కొద్ది భాగాన్ని మాత్రమే ప్రాజెక్టుకు ఖర్చు చేశారు" అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ పరిధిలో మంజూరైన పోస్టుల భర్తీకి బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, అనేక ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తెలంగాణపై వివక్ష చూపుతోందని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ.. వాటిని విస్మరించి దేశవ్యాప్తంగా ఉన్న 16 ఎయిమ్స్ లలో 14 ఎయిమ్స్ లకు కేంద్రం కేటాయించిన నిధుల్లో 50 శాతానికి పైగా విడుదల చేసింది. బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణానికి రూ.1,366 కోట్లు ఖర్చు చేస్తామని ప్రధాని మోడీ ఇటీవల హామీ ఇచ్చారని, కానీ ప్రాజెక్టు జాప్యానికి వివరణ ఇవ్వలేదన్నారు. ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.