భువనగిరి ప్రజాశీర్వాద సభలో అపశృతి.. కార్యకర్తకు హార్ట్ ఎటాక్.. మృతి

By Mahesh KFirst Published Oct 16, 2023, 6:38 PM IST
Highlights

యాదాద్రి భువనగిరి ప్రజాశీర్వాద సభ కోసం వచ్చిన కార్యకర్త గుండె పోటుతో మరణించాడు. సభా ప్రాంగణంలో కుప్పకూలిపోయిన సత్తయ్యను వెంటనే హాస్పిటల్ తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.
 

హైదరాబాద్: సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ రోజు జనగామాలో మాట్లాడిన తర్వాత యాదాద్రి భువనగిరిలో నిర్వహించిన సభకు హాజరయ్యారు. అయితే, సీఎం కేసీఆర్ భువనగిరికి రావడానికి ముందు ప్రజాశీర్వాద సభలో అపశృతి చోటుచేసుకుంది. ఈ సభకు వచ్చిన ఓ కార్యకర్తకు గుండెపోటు వచ్చింది. హాస్పిటల్ తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.

సీఎం కేసీఆర్ హాజరై మాట్లాడబోతున్న యాదాద్రి భువనగిరిలోని ప్రజాశీర్వాద సభ కోసం పోచంపల్లి మండలం జూలురుకు చెందిన సత్తయ్య వచ్చాడు. సీఎం కేసీఆర్ ఆ సభకు హాజరు కావడానికి ముందు ఆట, పాటలతో భువనగిరి ప్రభుత్వ కాలేజీ ఆవరణలోని ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం మారుమోగిపోయింది. ఈ సందర్భంలోనే సత్తయ్య కుప్పకూలిపోయాడు. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సత్తయ్యను పరీక్షించి అప్పటికే మరణించినట్టు ధ్రువీకరించారు.

Also Read: జనగామాలో కేసీఆర్ లౌకిక వచనాలు.. కాంగ్రెస్ ఎఫెక్టేనా?

జనగామా సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించిన తర్వాత సాయంత్రంపూట యాదాద్రి భువనగిరి ప్రజాశీర్వాద సభకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయం గురించి, పెరిగిన భూముల ధరల గురించి ప్రస్తావించారు. పూట పూటకు ధరలు పెరుగుతున్నాయని వివరించారు. యాదాద్రికి ఐటీ పరిశ్రమలను తీసుకురావాలని తాను మంత్రులకు చెప్పినట్టు తెలిపారు.

click me!