టీపీసీసీ చీఫ్ పదవి కోసం చివరివరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రయత్నించారు. ఈ పదవి దక్కకపోవడంతో రేవంత్ రెడ్డి డబ్ములతో ఈ పదవిని కొనుగోలు చేశారని ఆరోపించారు. అయితే ఆవేదనతోనే ఈ వ్యాఖ్యలు చేశానని ఆ తర్వాత వివరణ ఇచ్చారు. ఇవాళ రేవంత్ గురించి తన వద్ద మాట్లాడొద్దని ఆయన కోరారు.
న్యూఢిల్లీ: రేవంత్ రెడ్డి చిన్న పిల్లవాడు, ఆయన గురించి నా దగ్గర మాట్లాడొద్దని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.ఆదివారం నాడు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలపై తాను మాట్లాడానని గతంలో చెప్పానని ఆయన మీడియాకు గుర్తు చేశారు. రాజకీయాలను వదిలేసి నేతలంతా అభివృద్దిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. పీసీసీ చీఫ్ పదవి దక్కకపోయినా కూడ తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పార్టీ మారే ఆలోచన లేదన్నారు. తన దృష్టిలో పీసీసీ చీఫ్ పదవి చాలా చిన్నదన్నారు.
also read:పీసీసీ చీఫ్ దక్కనందుకు బాధగా ఉంది, కానీ అలా చేయను: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కిషన్ రెడ్డితో కోమటిరెడ్డి భేటీ
ఆదివారం నాడు ఉదయం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డిని ఆయన అభినందించారు. తెలంగాణ వారసత్వ సంపదగా ఉన్న భువనగిరి జిల్లా అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం తరపున నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కిషన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.