రాష్ట్రపతి కాన్వాయ్ నే ఆపేశాడు

First Published Jun 20, 2017, 3:31 PM IST
Highlights

ట్రాఫిక్ పోలీసు అంటే విఐపీల వాహనాలకే దారి ఇచ్చేవాడని అపవాదు ఉన్న రోజులివి. విఐపిల కోసం సామాన్యులను గంటల తరబడి ట్రాఫిక కష్టాల్లోకి నెట్టేవాడన్న విమర్శలున్నాయి. కానీ ఆ ట్రాఫిక్ ఎస్సై ఆ అపవాదును పటాపంచలు చేశాడు. భారత దేశాధినేత అయిన రాష్ట్రపతి వాహన శ్రేణికి బ్రేకులు వేశాడు. అంతిమంగా అందరి మన్ననలు పొందాడు.

ఓ నిండు ప్రాణాన్ని కాపాడేందుకు బెంగుళూరులో ఓ ట్రాఫిక్ ఎస్సై అనూహ్యమైన అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ దారిలో రయ్ రయ్ అంటూ  వెళ్తున్న రాష్ట్రపతి కాన్వాయ్ ని ఆపేశాడు. అదే దారిలో కుయ్ కుయ్ అంటూ వెళ్తున్న అంబులెన్సుకు దారిచ్చేందుకు ఆ ట్రాఫిక్ ఎస్సై ఈ సాహసం చేశాడు. ఆ ఎస్సై చేసిన పని మంచిదే కావడంతో అందరూ ఆయనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

 

గత శనివారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బెంగళూరులో పర్యటించారు. ఆ సందర్భంగా ట్రినిటీ సర్కిల్‌ మీదుగా రాష్ట్రపతి కాన్వాయ్‌ రాజ్‌భవన్‌కు వెళ్తున్నది. అదే సమయంలో ఓ అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ ఎస్సై ఎం.ఎల్‌ నిజలింగప్ప అంబులెన్స్‌ను గుర్తించారు. ఆ అంబులెన్స్‌ అక్కడికి సమీపంలోనిఒక ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన నిజలింగప్ప వెంటనే రాష్ట్రపతి కాన్వాయ్‌ని ఆపి అంబులెన్స్‌కు దారిచ్చాడు. ఆ తర్వాత రాష్ట్రపతి కాన్వాయ్‌ని పంపించారు.

 

ఎస్సై చేసిన ఈ సాహసం తెలుసుకున్న బెంగళూరు ట్రాఫిక్‌ పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌ అభయ్‌ గోయల్‌ ట్విటర్‌లో షేర్‌ చేసి.. నిజలింగప్పను ప్రశంసించారు. ఈ ట్వీట్‌ క్షణాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ప్రశంసల వర్షం కురిపించారు.  ఉన్నతాధికారులు నిజలింగప్ప అభినందిస్తూ రివార్డును అందజేశారు. శభాష్ నిజలింగప్ప. నీలాగే సామాన్యుల కష్టాలను గుర్తించే పోలీసులు రావాలంటూ పలువురు కొనియాడుతున్నారు.

PSI Sh Nijlingappa is rewarded for deftly allowing the ambulance before the 1st citizen of India. @blrcitytraffic gives way to 🚑, do you? pic.twitter.com/KoI2nap14N

— DCP Traffic East (@DCPTrEastBCP) 18 June 2017

 

click me!