
Mahatma Jyotiba Phule Gurukula schoolsఫ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం సూచించారు. మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల సోసైటీ రీజినల్ కోఆర్డినేటర్ ఆఫీసర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు చేశారు.
విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని, పోషకాహార లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి రీజినల్ కోఆర్డినేటర్ ప్రతి నెలలో తప్పనిసరిగా నాలుగు రోజులు పాఠశాలలో రాత్రి బస చేయాలని బుర్రా వెంకటేశం తెలిపారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. పాఠశాలల్లో ఎలాంటి సమస్యలున్నా.. వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
విద్యార్థుల సంక్షేమమే ప్రథమ ధ్యేయంగా పనిచేయాలన్నారు. విద్యాబోధన, ఆహారం, మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి అలసత్వం జరగకూడదని అధికారులకు సూచించారు. ప్రతి రీజనల్ కోఆర్డినేటర్ తప్పనిసరిగా తన పరిధిలోని పాఠశాలలను తరచూ సందర్శించాలని సూచించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్కు గురుకులాలు బాటలు వేయాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల సొసైటీ డిప్యూటీ సెక్రటరీలు ఇందిర, మంజుల, తిరుపతి, తెలంగాణలోని పది జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.