ఫంక్షన్ల కోసమే పార్లమెంట్ సమావేశాల బహిష్కరణ: టీఆర్ఎస్‌ ఎంపీలపై బండి సంజయ్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Dec 11, 2021, 3:28 PM IST
Highlights

పార్లమెంటు సమావేశాలను (parliament winter session) టీఆర్ఎస్ (trs) బహిష్కరించడంపై తెలంగాణ బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఫంక్షన్లు ఉన్నాయనే కారణంగానే పార్లమెంటు సమావేశాలను బహిష్కరించారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

పార్లమెంటు సమావేశాలను (parliament winter session) టీఆర్ఎస్ (trs) బహిష్కరించడంపై తెలంగాణ బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఫంక్షన్లు ఉన్నాయనే కారణంగానే పార్లమెంటు సమావేశాలను బహిష్కరించారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ (congress) , టీఆర్ఎస్ రెండు పార్టీలూ ఒకటేనని.. పార్లమెంటులో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని బండి సంజయ్ గుర్తుచేశారు. గతంలో కూడా ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయని ఆయన వెల్లడించారు. 

ఫైళ్లపై సంతకాలు చేసేటప్పుడు సీఎం కేసీఆర్ (kcr) సోయిలో ఉండాలని హితవు పలికారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ సంతకం చేశారని, బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని సంతకం చేశారని... రేపు దేనిపై సంతకం చేస్తారోనంటూ బండి ఎద్దేవా చేశారు. ప్రతి గింజను కొంటానని మాట తప్పిన చరిత్ర కేసీఆర్‌దంటూ ఆయన మండిపడ్డారు. కేసీఆర్ దేశానికి ఉపరాష్ట్రపతి అవుతారంటూ ప్రచారం చేయించుకుంటున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు. కేసీఆర్, ఆయన మంత్రులు మాట్లాడుతున్న మాటలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

Also Read:MLC Election 2021 : కేసీఆర్, బండి సంజయ్ ఓటు వేయలేదు.. ఎందుకంటే..

వర్షాకాలం పంటను కొనుగోలు చేయబోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ (piyush goyal) ఎక్కడా చెప్పలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం కేసీఆర్‌కు కనిపించడంలేదా అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేస్తారని చెబుతున్నారని.. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం నిధులు ఇచ్చినా భూసార పరీక్షలు ఎందుకు చేయడం లేదని ఆయన నిలదీశారు.  

పార్టీ సిద్ధాంతాలు, ప్రధాని మోడీ నాయకత్వాన్ని నమ్మి వచ్చే వాళ్లనే పార్టీలో చేర్చుకుంటామని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చే నేతలను పార్టీలో చేర్చుకోబోమని ఆయన పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదని.. పార్లమెంట్ సమావేశాల అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తామని బండి సంజయ్ వెల్లడించారు.  
 

click me!