Bandi Sanjay: తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి.. నిన్న 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి.. బండి సంజయ్

By team teluguFirst Published Nov 16, 2021, 10:59 AM IST
Highlights

టీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న దాడులకు సీఎం కేసీఆర్‌ సూత్రధాని అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. నిన్న జరిగిన దౌర్జన్య కాండను బీజేపీ (BJP) తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు.

టీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న దాడులకు సీఎం కేసీఆర్‌ సూత్రధాని అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. వానాకాలం పంట కొనాలని కోరితే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. నిన్న జరిగిన దౌర్జన్య కాండను బీజేపీ (BJP) తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. మంగళవారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. నిన్న టీఆర్‌ఎస్ శ్రేణులు జరిపిన దాడిలో 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి అని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి అన్నారు. సీఎం కేసీఆర్ బయటకు రారని.. ప్రగతి భవన్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. 

రైతుల కోసం ఏ దాడులైనా భరిస్తామన్నారు. దాడుల్లో రైతులకే కొడుగుడ్లు తగిలాయని, రాళ్లు తగిలితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతుల సమస్యలను చెప్పుకునేందుకు వస్తుంటే టీఆర్‌ఎస్‌ భయపడుతోందన్నారు. బాధలు చెప్పుకునేందుకు వచ్చే రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 

Also read: సూర్యాపేట జిల్లాలో బండి సంజయ్ కాన్వాయ్ పై రాళ్ల దాడి: కారు అద్దాలు ధ్వంసం, ఉద్రిక్తత

తమపై దాడులు జరుగుతాయని అధికారులకు, పోలీసులకు అన్ని తెలుసని.. అయినప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు. తమ పర్యటన షెడ్యూల్ ఇచ్చిన పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు.  బీజేపీపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఎలాంటి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదన్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని ఒప్పందం జరిగిందని అన్నారు. తెలంగాణ కంటే 8 రాష్ట్రాలు ఎక్కువ ధాన్యం పండిస్తున్నాయని.. అక్కడ లేని సమస్య ఇక్కడెందుకు అని ప్రశ్నించారు. వానా కాలం పంట కొనకుంటే (paddy procurement) టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్యే లేదన్నారు. పంట మొత్తం కొనుగోలు చేసేంత వరకు పోరాటం ఆగదని బండి సంజయ్ స్పష్టం చేశారు. 

ఇక, నిన్న నల్గొండ జిల్లాలో బండి సంజయ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తత నడుమ కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయన పర్యటనను అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్ శ్రేణులు యత్నించాయి. ఈ క్రమంలోనే  బండి సంజయ్ కాన్వాయ్ పై సూర్యాపేట జిల్లాలో  రాళ్ల దాడికి జరిగింది. దీంతో బండి సంజయ్ కాన్వాయ్ లోని  కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనను రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. 
 

click me!