
Coronavirus: కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. భారత్ లోనూ కరోనా వైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. దీంతో రోజువారీ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కొత్తగా కరోనా వైరస్ (Coronavirus) బారినపడుతున్న వారి సంఖ్య అధికంగా పెరుగుతున్నది. అయితే, కరోనా తన ప్రభావం పెంచుకుంటూ ప్రజల ప్రాణాలు తీసుకుంటున్న ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ కొందరు కేటుగాళ్లు.. కరోనా వైరస్ నకిలీ పరీక్షలు, ఫేక్ కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ల దందాకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఉత్తరాధిలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ నకిలీ పరిక్షల సర్టిఫికేట్ల వ్యవహారం బయటపడిన సంగతి తెలిసిందే. అదే తరహాలో తెలంగాణలోనూ కొందరు కేటుగాళ్లు కరోనా (Coronavirus) పరీక్షలు, టీకా సర్టిఫికేట్ల నకిలీ దందాకు తెరలేపారు. హైదరాబాద్లో నకిలీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షల రిపోర్టులు, కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు అందించిన పలువురిని పోలీసులు గత వారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి కరోనా వైరస్ నకిలీ రాకెట్ నడుపుతున్న మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. పాతబస్తీలో నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు జారీ చేసినందుకు కోవిడ్-19 డేటా ఎంట్రీ ఆపరేటర్తో సహా నలుగురు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఒక వారంలో పోలీసులు ఛేధించిన మూడో రాకెట్ కావడం గమనార్హం. ఈ కుంభకోణంలో భాగమైన ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, ఇది విస్తృత నెట్వర్క్ను కలిగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. గత వారం, పరీక్ష లేకుండానే నకిలీ నెగటివ్ RT-PCR రిపోర్టులను అందిస్తున్న రెండు మూఠాలను టాస్క్ ఫోర్స్ ఛేదించింది. డయాగ్నోస్టిక్ సెంటర్ యజమాని, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ట్రావెల్ ఏజెంట్లు, ఇతరులతో సహా ఆరుగురిని కూడా మోసపూరిత సర్టిఫికేట్లు జారీ చేసినందుకు అరెస్టు చేశారు.
ఇదే తరహాలో కాలాపత్తర్ రూ. 1,000 లంచం తీసుకుని టీకాలు తీసుకోకపోయిన బోగస్ టీకా సర్టిఫికేట్లు జారీ చేసినందుకు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పలు సెల్ఫోన్లు, ఆధార్ కార్డులు, నకిలీ కరోనా సర్టిఫికెట్లు, పరీక్ష, టీకా సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. చార్మినార్ ఏసీపీ జి. బిక్షం రెడ్డి మాట్లాడుతూ కాలాపత్తర్లోని అలీబాగ్లో నివాసముంటున్న మహ్మద్ సైఫ్(19), అలీబాగ్లో నివాసముంటున్న మహ్మద్ మిస్బావుల్లా షరీఫ్(22), షాహీన్నగర్లో నివాసముంటున్న మహ్మద్ అస్లాం(21), మహ్మద్ ఫరీద్(22)లు ఈ కరోనా నకిలీ రాకెట్ నడుపుతున్నారని తెలిపారు. నిందితుడు మహ్మద్ సైఫ్, సరూనగర్లోని మాధవ రెడ్డి కమ్యూనిటీ హాల్లోని కోవిడ్ -19 టీకా కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అతను ప్రజల నుండి రూ. 1000 తీసుకుని టీకాలు తీసుకోకపోయినప్పటికీ.. కరోనా టీకా ధృవీకరణ పత్రాన్ని అందిస్తున్నాడు. లతని స్నేహితులతో కలిసి ఈ ప్లాన్ వేశాడు.
కొన్ని ఆస్పత్రుల్లో వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో టీకా సర్టిఫికేట్ను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో, ఈ ముఠా అలాంటి వ్యక్తులను ఉపయోగించుకుని, డబ్బు చెల్లించి నకిలీ వ్యాక్సిన్ సర్టిఫికేట్ల తీసుకుంటున్నదని తెలిపారు. చాలా మంది ప్రజలు కూడా సైడ్ ఎఫెక్ట్స్కు భయపడి వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదని, దీని కారణంగానే ఈ నకిలీ సర్టిఫికెట్ రాకెట్స్ కొనసాగుతున్నాయని తెలిపారు.