మంత్రి కేటీఆర్ వ్యాఖ్యపై అక్బరుద్ధీన్ ఓవైసీ సంచలన ప్రకటన

By Sumanth KanukulaFirst Published Feb 4, 2023, 5:04 PM IST
Highlights

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎంఐఎం పార్టీ మీద చేసిన కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుంటున్నట్టుగా చెప్పారు. 

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కీలక ప్రకటన చేశారు. ఈ రోజు అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 50 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. తమకు 7 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని కేటీఆర్ అసెంబ్లీలో అన్నారని చెప్పారు. ఎంఐఎంపై కేసీఆర్‌ చేసిన కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుంటున్నామని అన్నారు. తాము వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేసే ప్రయత్నం చేస్తామని తెలిపారు. కనీసం 50 స్థానాల్లో పోటీలో నిలుస్తామని అన్నారు. ఇందుకు తమ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా అంగీకరిస్తాడని అనుకుంటున్నట్టుగా చెప్పారు. తమ పార్టీ కనీసం 15 మంది ఎమ్మెల్యేలను గెలుచుకునేలా చూస్తామని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. ఈరోజు శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రభుత్వం హామీలు ఇస్తుందని.. కానీ అమలు  చేయడం లేదని విమర్శించారు. పాతబస్తీ మెట్రో సంగతేమిటని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితేమిటని అడిగారు. ముఖ్యమంత్రి, మంత్రులు తమను కలవరని అన్నారు. కనీసం చెప్రాసిని చూపిస్తే వాళ్లనైనా కలుస్తామని చెప్పారు. ఇష్టా రీతిలో బీఏసీ లో నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. చర్చ సందర్భంగా సభా నాయకుడు కనిపించడం లేదని అన్నారు.  బీఆర్ఎస్ నేతలకు టీవీ డిబేట్లకు వెళ్లై టైం ఉంటుంది.. కానీ సభ కు వచ్చేందుకు టైం లేదా అని ప్రశ్నించారు. తాను 25 ఏళ్ళలో ఇలాంటి సభ చూడలేదని అన్నారు. 

అయితే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదని అన్నారు. అక్బరుద్దీన్ బీఏసీ సమావేశానికి రాకుండా, ఆయన బాధ్యత నెరవేర్చుకుండా ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని అన్నారు. ఆవేశంగా ప్రసంగం చేస్తే సరిపోదు.. అర్థవంతంగా కూడా మాట్లాడొచ్చని అన్నారు. ఎంఐఎంకు 7 గురు సభ్యులు ఉన్నారని.. వారికే అంత సమయం ఇస్తే ఎలా అని అన్నారు. ప్రభుత్వం పని చేయడం లేదని, మంత్రులు అందుబాటులో లేరనడం సరికాదని  అన్నారు. సమయపాలన పాటించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కోరారు. 

అయితే తాను కొత్త సభ్యుడిని కాదని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. చాలా సార్లు ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. టైమ్‌ను ఎలా ఉపయోగించుకోవాలో తమకు తెలుసని అన్నారు. రాజ్యంగబద్దంగా  చర్చ జరగాలని కోరారు. గతంలో చాలా సభల్లో గంటల సేపు చర్చించాం..ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదని అన్నారు. 
 

click me!