
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా కొన్ని బృందాలు నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. అగ్నిపథ్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే బంద్కు నేపథ్యంలో కేంద్రం, ఆయా రాష్ట్రాల పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. బంద్ పేరిట నిరసన కార్యక్రమాలకు దిగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు భద్రత పెంచింది. రైల్వే స్టేషన్ల దగ్గర రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులను మోహరించారు. తెలంగాణ విషయానికి వస్తే బంద్ ప్రభావం కనిపించడం లేదనే చెప్పాలి.
హైదరాబాద్లో యథావిథిగా బస్సులు, రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. వ్యాపార వాణిజ్య సముదాయాలు కూడా తెరుచుకున్నాయి. అయితే బంద్ నేపథ్యంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మాత్రం భద్రతను కట్టుదిట్టం చేశారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో.. రైల్వే స్టేషన్ వద్ద భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. భారత్ బంద్ పిలుపు నేపథ్యంలో.. ప్రజాసంఘాలు, ఆర్మీ అభ్యర్థులు రైల్వే స్టేషన్ వద్దకు రాకుండా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ఇతర రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులను మోహరించారు. ఇక, బంద్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: Agnipath stir : నేడు భారత్ బంద్ కు పిలుపు.. అప్రమత్తమైన రైల్వే అధికారులు.. హైఅలర్ట్..
మరోవైపు భారత్ బంద్భారత్ బంద్ పిలుపు నేపథ్యంలో పంజాబ్ లో కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పంజాబ్లోని అన్ని సైనిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు.. వాటి చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని పంజాబ్ పోలీస్ ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) కోరారు. అంతేకాదు అల్లర్లలో వీటికి ఎలాంటి హాని కలగకుండా రక్షించేందుకు ఆర్మీ అధికారులతో సన్నిహిత సమన్వయాన్ని కొనసాగించాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కూడా కోరారు.
బీహార్లోని 20 జిల్లాల్లో సోమవారం ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ జిల్లాల్లో కైమూర్, భోజ్పూర్, ఔరంగాబాద్, రోహతాస్, బక్సర్, నవాడా, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సమస్తిపూర్, లఖిసరాయ్, బెగుసరాయ్, వైశాలి, సరన్, ముజఫర్పూర్, దర్భంగా, గయా, మధుబని, జెహానాబాద్, ఖగారియా, షేక్పురా ఉన్నాయి.
నోయిడాలో 144 సెక్షన్
నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడాన్ని నిషేధించే సిఆర్పిసి సెక్షన్ 144ను విధించినట్లు గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడవద్దని ప్రజలను కోరారు. గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్ప్రెస్వేపై ఉన్న జెవార్ టోల్ ప్లాజా వద్ద శుక్రవారం జరిగిన హింసాత్మక నిరసనకు సంబంధించి ఇప్పటివరకు 225 మందిపై కేసులు నమోదు చేశారు. 15 మందిని అరెస్టు చేశారు.