
Telangana: తెలంగాణలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ ఇంజనీర్ నూనె శ్రీధర్ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం 13 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు, శ్రీధర్ వద్ద వంద కోట్ల రూపాయలకుపైగా అక్రమ ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆయనను రిమాండ్కు తరలించి చంచల్గూడ జైలుకు పంపించారు.
బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో శ్రీధర్, అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఈ విచారణలో తెల్లాపూర్లో విల్లా, షేక్పేట్లో స్కైహై కమ్యూనిటీలో 4,500 చ.అ. ఫ్లాట్,
అమీర్పేటలో కమర్షియల్ బిల్డింగ్, కరీంనగర్లో మూడు ఫ్లాట్లు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మూడు ఇండిపెండెంట్ హౌస్లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, 19 ఓపెన్ ప్లాట్లు, రెండు కార్లు, బంగారు ఆభరణాలు,బ్యాంకుల్లో డిపాజిట్లు, భారీ నగదు ఉన్నట్లు గుర్తించారు.
ఏసీబీ సోదాల్లో బయటపడిన ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ వందల కోట్ల రూపాయలుగా ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పలు కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల వివరాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీధర్ బినామీల పేర్లతో ఆస్తులు నమోదు చేసిన అనుమానాలు కలిగి ఉన్న ఏసీబీ, మరింత లోతుగా విచారణ చేపట్టింది.
శ్రీధర్ గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేశారు. ఆయన్ని చొప్పదండి నీటిపారుదల విభాగం EEగా పని చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. తన పదవిని దుర్వినియోగం చేసి భారీగా అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్టు ACB గుర్తించింది. ఇరిగేషన్ ఇంజనీర్ల సంఘానికి అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయనపై గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు నిశితంగా గమనిస్తున్నారు.
ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ACB దర్యాప్తు కొనసాగుతోంది. ఇదివరకే ప్రాజెక్ట్లో ఇంజినీరింగ్ చీఫ్ హరిరామ్ను కూడా అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు శ్రీధర్ అరెస్టు కేసు మరోసారి ఈ దర్యాప్తు ప్రాధాన్యత సంతరించుకుంది.
శ్రీధర్ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, 14 రోజుల రిమాండ్ విధించారు. గురువారం తెల్లవారుజామున ఆయన్ని చంచల్గూడ జైలుకు తరలించారు. లాకర్లు తెరచడం, బ్యాంకు ఖాతాల్లోని లావాదేవీలు విశ్లేషించడం ద్వారా మరిన్ని వివరాలు వెలుగులోకి తీసుకురావాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.