దిల్ సుఖ్ నగర్ హత్య కేసులో కీలకమలుపు : అమ్రాబాద్ లో స్నేహితుడి చేతిలో హతం, పరారీలో మరో ముగ్గురు..

By SumaBala BukkaFirst Published May 13, 2022, 2:15 PM IST
Highlights

దిల్ సుఖ్ నగర్ లో హత్య కేసులో కీలక మలుపు జరిగింది.  సొమ్ము మీద ఆశతో ఆ నలుగురు కలిసి సాయితేజను చంపేశారు అని బయటపడింది. 

సరూర్ నగర్ : దిల్ సుఖ్ నగర్ లో ఈనెల 7న జరిగిన మహిళ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. పెంపుడు తల్లి భూదేవి (58) హత్య ఘటనలో నిందితుడైన దత్తపుత్రుడు సాయితేజ (27)ను అతడి స్నేహితుడు శివ దారుణంగా హత్య చేశాడు. అమ్రాబాద్ అడవుల్లో రెండురోజుల క్రితం చంపేయగా, పోలీసులకు భయపడిన శివ గురువారం సరూర్ నగర్ పోలీస్ ఠాణాలో లొంగిపోయాడు. అనంతరం సరూర్ నగర్ పోలీసులు అక్కడి అటవీశాఖ, పోలీసుల సహాయంతో మృతదేహాన్ని గుర్తించారు. ఐదురోజుల క్రితం భూదేవిని హత్య చేసిన అనంతరం సాయితేజ, శివలు శ్రీశైలానికి పారిపోయారు. అక్కడికి వెళ్లాక పోలీసులు గుర్తించకుండా సాయితేజ గుండు కొట్టించుకున్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు. 

సాయితేజ వెంట ఉన్న బ్యాగులో 35 తులాల బంగారం, రూ.10లక్షల నగదు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అమ్రాబాద్ ఎస్సై సద్దాం హుసేన్ వివరాల ప్రకారం.. శివ, సాయితేజ ఈ నెల 10న శ్రీశైలం వెళ్లారని, తిరుగు ప్రయాణంలో అమ్రాబాద్ మండలం మల్లెతీర్థం జలపాతంకు వెళ్లారని, దూరంగా ఉన్న ఓ మడుగు వద్దకు వెళ్లాక సాయితేజను శివ బండరాయితో తలమీద కొట్టి చంపేశాడు. అనంతరం బ్యాగులో రాళ్లు నింపి నడుముకు కట్టి మడుగులో పారేశారని వివరించారు. మృతదేహాన్ని వెలికితీసి అచ్చంపేట ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అజ్ఞాతంలో ఇతర నిందితులు...
దిల్ సుఖ్ నగర్ న్యూ గడ్బి అన్నారం కాలనీకి చెందిన జంగయ్య యాదవ్, భూదేవి (58) దంపతులకు నిందితుడైన సాయితేజ దత్తపుత్రుడు..అయితే, అతని మానసిక ప్రవర్తన సరిగా లేకపోవడంతో స్నేహితులకు వీరి ఆస్తిపై కన్నుపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురు స్నేహితులు నర్సింహ, సాయిగౌడ్, చింటూ, శివలు సాయితేజను పావుగా వాడుకొని ఇంట్లో ఉన్న పెంపుడు తల్లిని చంపి ఆమె ఒంటిపై ఉన్న బంగారం, నగదు తీసుకువచ్చే విధంగా వారం రోజుల ముందు నుంచే పక్కా ప్రణాళికను రూపొందించారు.

అనుకున్నట్లుగానే భూదేవిని సాయితేజ, శివలు దిండుతో నోరు, ముక్కు మూయగా నర్సింహ చేతులు పెట్టుకుని చింటూ, సాయిగౌడ్ లో కాళ్లను గట్టిగా పట్టుకొని చనిపోయిందని నిర్థారించుకుని బంగారం, నగదుతో పరారయ్యారు. సొమ్ముతో ఆశతో ఆ నలుగురు కలిసి సాయితేజను చంపేశారు. గురువారం రాత్రి శివను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతని నుంచి రూ. లక్ష 22 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

click me!