
హైదరాబాద్ : చిన్నచిన్న కారణాలకే మైనర్లు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాదులోని జగద్గిరిగుట్టలో.. ఓ బాలిక ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. 15 ఏళ్ల వయసుకే ప్రేమలో పడిన ఆ బాలిక.. ప్రియుడుతో ఉన్న సమయంలో అతని వాట్సాప్ కు వేరే యువతి మెసేజ్ పంపడం చూసి మనస్థాపం చెందింది. దీంతో ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
దీనికి సంబంధించి సీఐ సైదులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీనివాస నగర్ కాలనీలో నివాసం ఉండే సూర్యప్రభ భర్త చనిపోయాడు. ఒక కూతురు ఉంది. ఆ అమ్మాయి సోమయ్య నగర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటోంది. సాయి తేజ అనే స్థానికంగా ఉండే ఓ యువకుడితో ప్రేమలో పడింది. సోమవారం మధ్యాహ్నం వీరిద్దరూ జగద్గిరిగుట్టలో కలుసుకున్నారు.
నవీన్ హత్య కేసు: శరీర భాగాలు దగ్దం చేసి బిర్యానీ తిన్న హరిహరకృష్ణ
సరదాగా మాట్లాడుకుంటుండగా సాయి తేజ ఫోన్ కు ఓ వాట్సప్ మెసేజ్ వచ్చింది. అది ఆ బాలిక చూసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నన్ను ప్రేమిస్తున్నానంటూ నాతో తిరుగుతూ మరో అమ్మాయితో కూడా ప్రేమలో ఉన్నావు అంటూ ఆ అమ్మాయి అలిగింది. మనస్థాపంతో ఇంటికి వెళ్లిపోయి సీలింగ్ ఫ్యాన్ ఉరేసుకుని చనిపోయింది. బాలిక ఇంటికి వచ్చిన సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమె చనిపోయిన విషయం వెంటనే తెలియలేదు.
సాయంత్రం తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె మృతి చెంది కనిపించింది. వెంటనే సమాచారం పోలీసులకు తెలపడంతో ఘటన స్థలానికి వచ్చిన వారు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ పంపించారు. బాలిక ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.