ఈటల రాజేందర్ మీద ఆరోపణలు హుష్ కాకి: రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ఆంతర్యం ఇదే....

By Asianet news TeluguFirst Published Aug 23, 2021, 3:37 PM IST
Highlights

తాజాగా రేవంత్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. ఈటెల రాజేందర్... తాను పీసీసీ అధ్యక్షుడవకముందు బీజేపీలో చేరాడని, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు అని అనడమే కాకుండా ఓపెన్ ఇన్విటేషన్ కూడా ఇచ్చారు. 

హుజురాబాద్ ఉపఎన్నిక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్. కర్ణాటక తరువాత తమకు దక్షిణ భారతదేశంలోకి ఎంట్రీ ఇవ్వడానికి మరో అనువైన రాష్ట్రం అనుకుంటున్నా తెలంగాణలో... నాగార్జున సాగర్, ఎమ్మెల్సీ దెబ్బల తరువాత అనూహ్యంగా ఈటెల రాజేందర్ రూపంలో అనుకోకుండా కలిసివచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి చూస్తుంది బీజేపీ నాయకత్వం. 

ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కూడా పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టడం, దానితో కాంగ్రెస్ లో కూడా కొత్త జోష్ రావడంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా మరింతగా వేడెక్కింది. తెలంగాణాలో తెరాస కు ప్రత్యామ్నాయం మేమే అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీకి కొత్త జోష్ నింపుకున్న కాంగ్రెస్ పెను సవాలు విసురుతుంది. 

Also Read: ఈటలకు షాక్: ఇద్దరు కీలక నేతలు బీజేపీకి గుడ్‌బై, టీఆర్ఎస్‌లో చేరికకు రంగం సిద్దం

ఇక తాజాగా రేవంత్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. ఈటెల రాజేందర్... తాను పీసీసీ అధ్యక్షుడవకముందు బీజేపీలో చేరాడని, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు అని అనడమే కాకుండా ఓపెన్ ఇన్విటేషన్ కూడా ఇచ్చారు. 

ఈటెల ఇప్పటికిప్పుడు బీజేపీ ని వీడి కాంగ్రెస్ లో చేరరు. అది సుస్పష్టం. కానీ రేవంత్ వ్యాఖ్యల్లో అంతర్లీనంగా మరో మాట కూడా అన్నారు. కేసీఆర్ తన మీద పెట్టిన కేసుల నుండి రక్షణ కోసమే బీజేపీలో చేరారు అని అన్నారు. 

ఈటెల మీద ఆరోపణలు రాగానే రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేసిందో మనమందరం చూసాము. ఐఏఎస్ లు, అధికారులు అంతా కూడా వరుస భేటీలు, ఫీల్డ్ విజిట్ లు నిర్వహిస్తూ ఈటెల పై రిపోర్టుల మీద రిపోర్టులు తయారుచేసారు. 

కానీ ఏమి జరిగిందో ఏమో కానీ... ఈటెల బీజేపీలో చేరినప్పటినుండి ఆ విషయంపై అసలు రాష్ట్ర ప్రభుత్వం స్పందించడమే మానేసింది. ఎక్కడా కూడా ఈటెల కేసుకు సంబంధించిన విషయాలు చర్చకు రావడం లేదు. ప్రభుత్వ అధికార పత్రికలో కూడా ఎక్కడా ఈ విషయానికి సంబంధించిన వార్తలు కనబడడం లేదు. 

Also Read: క్యారెక్టర్ లెస్ సీఎం కేసీఆర్... ఇండియా టుడే సర్వేలో తేలిందిదే: ఈటల సంచలనం

మహా అయితే ఎన్నికకు సంబంధించిన వార్తలు, గతంలో చేసిన అవినీతి ఆరోపణల తాలూకూ వ్యాఖ్యలు ఉంటున్నాయి తప్ప ఎక్కడా కూడా విచారణకు సంబంధించి పురోగతి అనో... లేదా వేరే ఏ విధమైన అంశాలు కూడా కనిపించడం లేదు. 

దీన్ని బట్టి చూస్తుంటే తన మీద ప్రభుత్వం పెట్టిన కేసుల నుంచి రక్షణ కోసమే బీజేపీలో ఈటెల చేరారు అనే మాటకు బలం చేకూరుతుంది. ఈ పరిస్థితుల్లో ఈటెల ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ లో చేరలేరు. 

కానీ.... ఈటెల అనుచరుల్లో చాలా మంది ఈటెల కాంగ్రెస్ లో చేరితే బాగుండునని అన్న విషయం తెలిసిందే. స్వభావ రీత్యా అయినా... సైద్ధాంతిక రీత్యా అయినా ఈటెలకు కాంగ్రెస్ మంచి వేదిక అయి ఉండేదని ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. 

click me!