ఢిల్లీ పర్యటనలో చంద్రబాబుకు నిరాశ: భేటీకి ఆసక్తి చూపని అమిత్ షా, కారణం ఇదీ..

Published : Oct 27, 2021, 08:40 AM ISTUpdated : Oct 27, 2021, 08:41 AM IST
ఢిల్లీ పర్యటనలో చంద్రబాబుకు నిరాశ: భేటీకి ఆసక్తి చూపని అమిత్ షా, కారణం ఇదీ..

సారాంశం

టీడీపీ కార్యాలయాలపై దాడి సంఘటనలపై అమిత్ షాకు ఫిర్యాదు చేయడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చంద్రబాబుకు జాతీయ మీడియా కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు. కారణాలేమిటో చూద్దాం.

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఢిల్లీ పర్యటనలో నిరాశే ఎదురైంది. ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. వారి అపాయింట్ మెంట్ కోసం చంద్రబాబు తీవ్రంగానే ప్రయత్నించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు Chnadrababu ఢిల్లీలో ఉన్నారు. కాశ్మీర్ పర్యటనను ముగించుకుని మంగళవారం మధ్యాహ్నం అమిత్ షా ఢిల్లీ తిరిగి వచ్చారు. అయినప్పటికీ చంద్రబాబును ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. 

తమ TDP కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన సంఘటనపై చంద్రబాబు అమిత్ షాకు ఫిర్యాదు చేస్తానని చెప్పి ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి వినతిపత్రం అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన Ramanath Kovind ను కోరారు. రాష్ట్రపతిని కలిసిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్తే జాతీయ మీడియా విశేషమైన ప్రాధాన్యం ఇచ్చేది. కానీ, ఈసారి జాతీయ మీడియా కూడా చంద్రబాబును పెద్దగా పట్టించుకోలేదు. 

Also Read: ముగిసిన బాబు ఢిల్లీ పర్యటన: దొరకని మోడీ, అమిత్ షా అపాయింట్‌మెంట్లు... రాష్ట్రపతి భేటీతోనే సంతృప్తి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS Jagan మీద ఆయన విరుచుకుపడి జాతీయ స్థాయిలో చర్చకు పెట్టాలనే ఆయన ప్రయత్నం కూడా ఫలించలేదు. జాతీయ మీడియా పట్టించుకోకపోవడంతో ఈ విషయంలో కూడా ఆయన విఫలమయ్యారు. బిజెపియేతర పార్టీలు కూడా చంద్రబాబును పట్టించుకున్నట్లు లేదు. గతంలో సిపిఐ, సీపీఎం తదితర పార్టీలు ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తూ వచ్చాయి. ఈసారి ఆయన ఢిల్లీలో ఒంటరి పోరాటమే చేయాల్సి వచ్చింది.

చంద్రబాబు ఢిల్లీ పర్యటనను దెబ్బ తీయడానికి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. Amit Shah కుటుంబం తిరుమల వచ్చినప్పుడు టీడీపీ కార్యకర్తలు రాళ్లు వేసిన సంఘటనను మంత్రులు గుర్తు చేస్తూ వచ్చారు. అదే విషయాన్ని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు గుర్తు చేశారు. ఆ సంఘటనను తమ పార్టీ మరిచిపోలేదని ఆయన గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని బూతులు తిట్టి ఇప్పుడు ఓ మొహం పెట్టుకుని అపాయింట్ మెంట్ అడుగుతారని కూడా ఆయన ప్రశ్నించారు. 

Also Read: సీఐపై దాడి: టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట.. పోలీసులకు న్యాయస్థానం కీలక ఆదేశాలు

చంద్రబాబుకు నరేంద్ర మోడీ, అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వెనక రాజకీయ కారణం కూడా ఉంది. బిజెపికి ఇప్పుడు చంద్రబాబు అవసరం లేదు. వైఎస్ జగన్ బిజెపికి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఆయన బిజెపికి ఎదురు తిరిగే పరిస్థితి కూడా లేదు. తన మీద కేసులు ఉన్నంత వరకు బిజెపికి గానీ కేంద్ర ప్రభుత్వానికి గానీ ఆయన ఎదురు తిరగబోరనేది విశ్లేషకుల అంచనా. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ పార్లమెంటు సభ్యుల మద్దతు పొందడానికి బిజెపికి ఏ విధమైన ఆటంకాలు కూడా లేవు. ఈ స్థితిలో చంద్రబాబును పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?