Praja Prasthanam: వైవీ సుబ్బారెడ్డి భేటీ, షర్మిల వెనక వైఎస్ జగన్

By telugu teamFirst Published Oct 25, 2021, 11:21 AM IST
Highlights

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రలో కీలకమైన సంఘటన చోటు చేసుకుంది. షర్మిలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలుసుకుని పాదయాత్రపై ఆరా తీశారు.

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ షర్మిల చేయి పెట్టడం వెనక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. వైఎస్ జగన్ పాత్ర ఉందని చెప్పడానికి తాజా సంఘటన నిదర్శనమని అంటున్నారు. YS Sharmila వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి ప్రస్తుతం Praja Prasthana yatra పేరు మీద పాదయాత్ర చేస్తున్న విషయం తెలసిందే. తన పాదయాత్రలో ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. 

YS Jagan, షర్మిల మధ్య విభేదాలున్నాయని, అందుకే షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించారని ప్రచారం జరుగుతూ వస్తోంది. తెలంగాణలో రాజకీయాలు వద్దని జగన్ షర్మిలకు చెప్పారని ఓ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా చెప్పారు. వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం యాత్రలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎత్తిచూపుతూ జగన్ ప్రమేయంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. షర్మిల వెనక పక్కాగా జగన్ ఉన్నారని ప్రచారం సాగిస్తున్నారు. 

Also Read: వైఎస్ షర్మిలను కలిసిన టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి

షర్మిల ప్రజాప్రస్థానం యాత్రను వైఎస్ జగన్ తల్లి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. షర్మిల ఐదో రోజు పాదయాత్రలో మహేశ్వరంలో కీలకమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. టీటీడీ చైర్మన్, వైఎస్ జగన్ బంధువు వైవీ సుబ్బారెడ్డి షర్మిలతో సమావేశమయ్యారు. వారివురి మధ్య దాదాపు గంటపాటు మంతనాలు జరిగాయి. దానికితోడు YV Sunna Reddy షర్మిల పాదయాత్రకు సంఘీభావం కూడా తెలిపారు. వైఎస్ జగన్ రాయబారిగానే వైవీ సుబ్బారెడ్డి షర్మిలను కలిశారని చెబుతున్నారు. 

వైవీ సుబ్బారెడ్డిని వైఎస్సార్ టీపీ నేతలు కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి, నాడుక రాజగోపాల్, సయ్యద్ ముజ్తాబా అహ్మద్, మతీన్ ముజాద్దాది ఆహ్వానించారు. షర్మిల పాదయాత్ర జరిగిన తీరును వైవీ సుబ్బారెడ్డి వారిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇతర నాయకులను బయటకు పంపించి వైఎస్ షర్మిల, వైవీ సుబ్బారెడ్డి ముఖాముఖి సమావేశమయ్యారు. పాదయాత్ర లభిస్తున్న స్పందనపై వైవీ సుబ్బారెడ్డి అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా వైఎస్ విజయమ్మను కూడా వైవీ సుబ్బారెడ్డి కలుస్తారని చెబుతున్నారు. 

Also Read: కేసీఆర్ కి సవాల్.. కొనసాగుతున్న షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర..!

నిజానికి, జగన్ తో తనకు విభేదాలున్నాయని వైఎస్ షర్మిల చెప్పలేదు. కేవలం అభిప్రాయభేదాలు మాత్రమే ఉన్నాయని గతంలో అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దనేది వైఎస్ జగన్ అభిమతమని, ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం వైఎస్ జగన్ తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని వైఎస్ షర్మిల చెప్పారు. షర్మిల మాత్రమే కాకుండా సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా అదే విషయం చెప్పారు. అయితే, జగన్ తో విభేదించి షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టారని ఆయన చెప్పారు. 

click me!