
తమ పార్టీ నేతలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేసి.. ప్రతిపక్షం ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీలోకి ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని తాము స్పీకర్ను కోరామని, కానీ స్పీకర్ మాత్రం చంద్రబాబు డైరెక్షన్లో నడుచుకుంటూ.. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడం లేదని ఆయన అన్నారు. అందుకే వైసీపీ ఈ విషయంలో కోర్టుకు వెళ్లిందని, స్పీకర్ నిర్ణయం తీసుకుంటే తాము కోర్టుకు వెళ్లాల్సిన అసవరం ఏముందని ధర్మాన ప్రశ్నించారు.
ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఆదివారంలోగా సస్పెండ్ చేయాలని ధర్మాన డిమాండ్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఆదివారంలోగా అనర్హులుగా ప్రకటిస్తే.. సోమవారం నుంచి తమ సభ్యులు సభకు వస్తారని తెలిపారు. చంద్రబాబు రాక్షస పాలన గురించి చెప్పుకోవడానికి ప్రజలు పెద్దసంఖ్యలో జగన్ పాదయాత్రకు తరలివస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి రూ. 97వేల కోట్ల అప్పు వస్తే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ. లక్షకోట్లకుపైగా అప్పు చేశారని మండిపడ్డారు..