
వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. పాదయాత్రకు భంగం కలిగినా.. జగన్ కి ఏదైనా జరిగినా.. పూర్తి బాధ్యత చంద్రబాబుదేనని ఆయన అన్నారు. టీడీపీ కుట్రలను ఎదుర్కోవాల్సిందిగా వైసీపీ కార్యకర్తలకు అంబటి సూచించారు.
జగన్ తలపెట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ విజయవంతం కావాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పూజలు చేస్తున్నారన్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం పాదయాత్రను అడ్డుకోవాలంటున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చెప్పినట్లు..పాదయాత్రలో అనుకోని సంఘటనలు జరిగే అవకాశమే లేదన్నారు. గతంలో షర్మిల చేసిన పాదయాత్ర కూడా ప్రశాంతంగానే జరిగిందని గుర్తు చేశారు. మాట్లాడితే చంద్రబాబు తుని ఘటనను గుర్తుచేస్తున్నారని.. వాస్తవానికి తుని కుట్ర చేసింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. దమ్ముంటే తుని నివేదికను బయటపెట్టాలని సవాలు విసిరారు.
ఒకవైపు రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందని చెబుతూనే.. మరోవైపు చంద్రబాబు డబ్బుని మంచి నీళ్లలాగా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే పలు కాన్వాయిలు ఉండగా.. మళ్లీ కొత్తగా చంద్రబాబుకి కాన్వాయి అవసరమా అని ప్రశ్నించారు. ఇప్పటికీ విదేశీ పర్యటనల పేరిట రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.