పవన్ కి మద్దతుగా నిలిచిన జేపీ

First Published Feb 8, 2018, 5:13 PM IST
Highlights
  • లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిశారు.
  • ఏపీ విభజన హామీల సాధన విషయంపై చర్చించేందుకు పవన్ జేపీని కలిశారు.

తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మరో కొత్త మలుపు తిరుగుతున్నాయి. గురువారం లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిశారు. ఏపీ విభజన హామీల సాధన విషయంపై చర్చించేందుకు పవన్ జేపీని కలిశారు. కాగా.. పవన్ జేపీని కలిశారు అనగానే.. వీరిద్దరూ రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకోనున్నారంటూ ప్రచారం మొదలైంది. ఇటీవల పవన్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు టీడీపీ, బీజేపీలతో ఎలాంటి పొత్తు లేదని చెప్పడంతో.. ఇక లోక్ సత్తా తో పొత్తు పెట్టుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా పవన్ తో భేటీ అనంతరం జేపీ మీడియాతో మాట్లాడారు. పవన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రజల కోసం తపించే పవన్‌‌కల్యాణ్‌ను అభినందిస్తున్నానన్నారు. విభజన చట్టాన్ని అమలుచేయకపోవడమంటే.. ‘ఏరు దాటాక తెప్ప తగలేసినట్టే’నని జేపీ వ్యాఖ్యానించారు. రాతపూర్వక హామీలు కూడా అమలుచేయడం లేదని ఆయన దుయ్యబట్టారు. రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇరు రాష్ట్రాల్లో శాంతియుత వాతావరణం నెలకొందని, సీఎంలను అభినందిస్తున్నానని చెప్పారు. విభజన హామీల సాధనకు తమ వంతు కృషిచేస్తామని జయప్రకాష్‌ నారాయణ స్పష్టం చేశారు. ఏపీకి న్యాయం జరగాలంటే కేవలం జేపీ, పవన్ ల వల్ల కాదని.. ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

click me!