తెలంగాణా ను వదిలేసినట్లేనా

Published : Jan 18, 2017, 01:01 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
తెలంగాణా ను వదిలేసినట్లేనా

సారాంశం

ఎప్పుడైతే ఓటుకునోటు కేసు తెరపైకి వచ్చిందో తను హైదరాబాద్ లో ఉండటం క్షేమకరం కాదని చంద్రబాబు భావించారు.

 

తండ్రి, కొడుకులు తెలంగాణాను దాదాపు వదిలేసినట్లే కనబడుతోంది. తెలంగాణాలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనటంలేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తల బొప్పి కట్టిన తర్వాత తెలంగాణా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటానికి సైతం ఇద్దరూ ఇష్టపడటం లేదని సమాచారం. ఎంతైనా టిడిపికి చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు కాబట్టి తెలంగాణా నేతలే అవసరమైనపుడల్లా విజయవాడకు వెళ్ళి కలుస్తున్నారు.

 

రెండు రాష్ట్రాల్లోనూ టిడిపి బలపడవచ్చన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు రెండుకళ్ల సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. అయితే, ‘అనుకున్నదొక్కటి....అయినది ఒక్కటి’ లాగ పార్టీ పరిస్ధితి తయారైంది. ఏపిలో అధికారంలోకి వచ్చినా తెలంగాణాలో మాత్రం ఉనికిని చాటుకోవటానికే నానా అవస్తలు పడుతున్నది.

 

చంద్రబాబునాయుడు సహా పార్టీ యంత్రాంగంలో అత్యధికులకు హైదరాబాద్ లోనే స్ధిరనివాసం ఉంది. అయితే, ఎన్నికలైన తర్వాత ‘ఓటుకునోటు’ కేసు ఫలితంగా చంద్రబాబు అర్ధాంతరంగా హైదరాబాద్ ను వదిలేయాల్సి వచ్చింది. దాని ప్రభావం పార్టీపై బాగానే పడింది. ఎప్పుడైతే ఓటుకునోటు కేసు తెరపైకి వచ్చిందో తను హైదరాబాద్ లో ఉండటం క్షేమకరం కాదని చంద్రబాబు భావించారు. దాదాపు ఏడాదిన్నర క్రితం విజయవాడకు వెళ్లిపోయిన చంద్రబాబు అప్పటి నుండి ఎంతో అత్యవసరమైతే తప్ప హైదరాబాద్ కు రావటం లేదు.

 

జిహెచ్ఎంసి ఎన్నికల్లో సారధ్య బాధ్యతలను లోకేష్ కే వదిలేసినా ఉపయోగం కనబడలేదు. దాంతో హైదరాబాద్ తో చంద్రబాబుకున్న దశాబ్దాల మానసిక బంధం తెగిపోయినట్లే. అయితే, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాంన్ష్ మాత్రం హైదరాబాద్ లోనే ఉన్నారు. అందుకనే లోకేష్ మాత్రం విజయవాడ-హైదరాబాద్ మధ్య తిరుగుతున్నారు.

 

అన్నిటికీ మించి హెరిటేజ్ సంస్ధతో పాటు సొంతఇల్లు, ఇతరత్రా ఆస్తులు కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఆమాత్రం రాకపోకలన్నా చంద్రబాబు సాగిస్తున్నారు. లేకపోతే ఓటుకునోటు దెబ్బకు హైదరాబాద్ లో అడుగుపెట్టి ఉండేవారు కారేమో. టిఆర్ఎస్ దెబ్బకు కుదేలైన పార్టీ సమీప భవిష్యత్తులో కోలుకోవటం కష్టమేనన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు కనబడుతోంది. అందుకనే పూర్తిగా పార్టీని వదిలిపెట్టేసారు. ఏదో హైదరాబాద్ వచ్చినపుడు మొక్కుబడిగా  తండ్రి, కొడుకులు పార్టీ నేతలను కలవటం తప్ప ఇతరత్రా కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. తెలంగాణాకు సంబంధించి పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా తెలంగాణా నేతలకే చంద్రబాబు వదిలేయటం గమనార్హం.  

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu