కెసిఆర్ గజ్వేల్ ఆసుపత్రి ఆక్రందన ఇది

Published : Jul 05, 2017, 02:45 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
కెసిఆర్ గజ్వేల్ ఆసుపత్రి ఆక్రందన ఇది

సారాంశం

గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం దేశంలోని వివిఐపి నియోజకవర్గాలలో ఒకటి. ఇది తెలంగాణా ముఖ్యమంత్రి  కెసిఆర్ నియోజకవర్గం. కొత్త రాష్ట్రం, కొత్త ముఖ్యమంత్రి కాబట్టి ఈ నియోజకవర్గం దేశానికే ఆదర్శం అవుతుందని ఇతర నియోజకవర్గాల ప్రజలు అసూయ పడి ఉండవచ్చు. అయితే, గజ్వేల్ అసుపత్రి చెప్పే కథే వేరు అంటున్నది ‘ఈనాడు’

గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం దేశంలోని వివిఐపి నియోజకవర్గాలలో ఒకటి. ఇది తెలంగాణా ముఖ్యమంత్రి  కెసిఆర్ నియోజకవర్గం. కొత్త రాష్ట్రం, కొత్త ముఖ్యమంత్రి కాబట్టి ఈ నియోజకవర్గం దేశానికే ఆదర్శం అవుతుందని ఇతర నియోజకవర్గాల ప్రజలు అసూయ పడి ఉండవచ్చు.  ఎందుకంటే,  ముఖ్యమంత్రి సెక్రెటేరియట్ లో కంటే ఎక్కువ సమయం గడిపేది నియోజకవర్గంలో ఉండే ఫార్మ్ హౌస్ లోనే. ఈ నేపథ్యంలో గజ్వేల్ ఆసుపత్రి ఎంత దయనీయంగా ఉందో ఈనాడు దినపత్రిక అసక్తి కరమయిన కథనం ప్రచురించింది.

 

గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో సమస్యలు తిష్ట వేశాయి. తీర్చేవారు లేక ఆస్పత్రికి వస్తున్న పేద రోగులు అవస్థ పడుతున్నారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉండాలని వైద్యారోగ్య శాఖ ద్వారా ఏటా రూ.కోట్లాది నిధులు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయలో ఇంకా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయనేందుకు ఈ ఆసుపత్రిలో పరిస్థితులే నిదర్శనం.

 

ఈనాడు కథనం ప్రకారం...

 

రోజుకు పది ప్రసవాలు జరిగే గజ్వేల్‌ ఆస్పత్రిలో ఒక్కరే రేడియాలజిస్టు, ఒక్కరే మత్తుమందు డాక్టరు ఉండటంతో సేవలు సరిగా అందడం లేదు. దీంతో అవకాశం ఉన్న గర్భిణిలంతా ప్రైవేటు ఆస్పత్రులకు తరలిపోతున్నారు. సర్కారు దవాఖానాల్లో పురుడు పోసుకోవాలని ‘అమ్మఒడి’ పథకం తీసుకొచ్చిన నేపథ్యంలో పెరుగుతోన్న రద్దీకి తగ్గట్టుగా సేవలు అందటం లేదు అని ‘ఈనాడు’ రాసింది.

 

కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటి అభివృద్ధి పనిచేపట్టింది ఈ ఆసుపత్రిలోనే. రూ.70 లక్ష్యల వ్యయంతో ఒక హైరిస్కు కేంద్రం ఏర్పాటు చేయించారు. కాన్పులంటేనే కాసులు చెల్లించలేక అవస్థలు పడే పేదలకు ఇది వరంఅవుతుందని అపుడంతా ఆశపడ్డారు. కానీ రానురాను సేవలు సన్నగిల్లటంతో పాటు సౌకర్యాల లేమి కారణంగా ఆస్పత్రికొచ్చే వారు అవస్థ పడుతున్నారు. గత నెల నుంచి అమలవుతున్న అమ్మఒడి పథకం కారణంగా రద్దీ పెరిగింది. నెలకు 300 ప్రసవాలు దాటుతున్నాయి. 

 

కొత్తరేకులు వేసి గోడలకు రంగులద్ది, విద్యుత్తు వ్యవస్థ మెరుగుపరిచి, రూ.14 లక్షలు ఖర్చు చేసి మరుగుదొడ్లు కట్టించారు.ఆస్పత్రి వెనకభాగంలో ఉండటం, పరిసరాలు భయానకంగా ఉండటంతో ఎవరూ ఇక్కడ ఉండేందుకు సాహసించడం లేదు. చివరికి మందుడబ్బాలు, విరిగిపోయిన మంచాలు, కుర్చీలు వేయటంతో మళ్లీ ఇప్పుడు స్టోర్‌ గదిగా మారిపోయింది.

పేదలు చలిలో కేంద్రం వాకిట్లోనే నిద్రపోతున్నారు. రాత్రిపూట దోమలు, ఈగల మధ్య అవస్థ పడుతున్నారు. సరైన తావు లేక మహిళలు, పురుష సహాయకులు అంతా ఒక్కచోటే నిద్రించాల్సి వస్తుండటంతో నిత్యం వివాదాలకు దారితీస్తోంది. బయట ఎక్కడైనా ఉందామనుకుంటే లోపల శిశువు, బాలింతకు ఎప్పుడు ఏం అవసరం వస్తుందో? అని అక్కడే అవస్థలు పడుతూ ఉంటున్నామని సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


గర్భిణి కోసం ఏడాది క్రితమే స్కానింగ్‌ కేంద్రం ఏర్పాటుచేశారు. రోజుకు 70 మంది వరకు గర్భిణిలకు స్కానింగ్‌ వస్తున్నారు. రేడియాలజిస్టు ఒక్కరే ఉండటంతో రోజుకు అరపూట మాత్రమే స్కానింగ్‌ సాగుతోంది. డాక్టరు లేని సమయంలో ఆస్పత్రికి వచ్చే వారిని మరో ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు.

 

గజ్వేల్‌లోని హైరిస్కు కేంద్రంలో తలెత్తుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వైద్యాధికారి కాశీనాథ్ చెప్పారు. మత్తు డాక్టర్లను నియమించామని వారం రోజుల్లో విధుల్లో చేరుతారని కొత్తగా నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ఈ  ఆస్పత్రిని పూర్తిగా ఎంసీహెచ్‌కు కేటాయిస్తామని ఆయన చెప్పారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu