NEWS
మనం ఇంట్లో రోజువారీ ఉపయోగించే పలు పదార్ధాలపై జీఎస్టీ తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం.. దోశ పిండి, ఇడ్లీ పిండి, కస్టర్ పౌడర్, గ్యాస్ లైటర్ వంటి వాటిపై జీఎస్టీ తగ్గ నుంది. వీటితోపాటు దాదాపు డజన్ వస్తువులపై పన్ను శాతాన్ని తగ్గించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ వస్తువులకు సంబంధించిన రంగాల నుంచి ఎదురైన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
బ్రాండెడ్ దుస్తులు, బ్యూటీ పార్లర్ లు తదితర వాటిపై జీఎస్టీని పెంచిన సంగతి తెలిసిందే. కాగా బ్రాండెడ్ కాని ఆహార వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించారు. బ్రాండెడ్, ప్యాకేజ్డ్ ఆహార వస్తువులపై 5శాతం పన్ను విధిస్తున్నారు. దీంతో చాలా వరకు వ్యాపారులు తమ బ్రాండ్ల రిజిస్ట్రేషన్ను రద్దు చేసుకోని తద్వారా పన్ను పడకుండా చూసుకుంటున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏదైనా రిజిస్టర్ బ్రాండ్పై జీఎస్టీ విధించడానికి, కట్ ఆఫ్ తేదీని 2017 మే 15గా గుర్తించాలని ఫిట్మెంట్ కమిటీ జీఎస్టీ మండలికి సిఫారసు చేసింది. హైదరాబాద్లో సెప్టెంబరు 9న జరిగే సమావేశంలో జీఎస్టీ మండలి దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. ఆగస్టు 5న జరిగిన సమావేశంలో కొన్ని వస్తువులపై పన్ను రేట్లు తగ్గించారని, మరికొన్నిటిపై సెప్టెంబరు 9న నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చింతపండు పై ఉన్న జీఎస్టీ 12 కాగా.. పన్ను శాతం తగ్గించాక.. అది 5కు చేరనుంది. అలాగే కస్టర్డ్ పౌడర్ ప్రస్తుత జీఎస్టీ 28.. పన్నుశాతం తగ్గింపు తర్వాత 18కి రానుంది. రబ్బర్ బాండ్లు, కంప్యూటర్ మానిటర్లు, గ్యాస్ లైటర్ల ప్రస్తుత జీఎస్టీ 28 కాగా..తగ్గింపు తర్వాత 18కి రానుంది. దోశ,ఇడ్లీ పిండి ప్రస్తుత జీఎస్టీ 18కాగా.. పన్ను తగ్గింపు తర్వాత 12కి చేరనుంది. అగరబత్తీల ప్రస్తుత జీఎస్టీ 12 నుంచి 5కి మారనుంది. ఆయిల్ కేకులపై ప్రస్తుతం ఎలాంటి జీఎస్టీ లేకపోగా.. సవరణ తర్వాత జీఎస్టీ 5కి మారనుంది.