
మహాత్ముడి నుంచి ఇప్పటి వరకు మద్యపాన రహిత గ్రామాల కోసం ఎందరో ఉద్యమించారు.
మద్యనిషేధం కోసం మన దేశంలోని ప్రతి గ్రామం ఏదో ఒకసారి నిరసగళం వినిపించిందే. కానీ, ఈ గ్రామం కాస్త వెరైటీ. తమ ఊళ్లో మద్యం షాపులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులందరూ ధర్నాకు దిగారు.
కర్ణాటక రాష్ట్రంలోని హసన్ లోని కౌషిక గ్రామవాసులు ఈ అరుదైన ధర్నా చేపట్టారు.
శుక్రవారం గ్రామంలోని వారందరూ హసన్ లోని డిప్యూటీ కమిషరేట్ కార్యాలయానికి భారీగా తరలి వచ్చారు.
అక్కడే కార్యాలయం ముందు మందు బాటిల్ పట్టుకొని ధర్నాకు దిగారు. వెంటనే తమ గ్రామంలో మద్యంషాపును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తమ గ్రామంలో అందరూ రోజువారి కార్మికులేనని, అందరికీ రోజు మందుతాగే అలవాటు ఉందని వారు మీడియాకు తెలిపారు.
తమ గ్రామంలో మద్యంషాపు లేనందువల్ల రోజు 10 కి.మీ. దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వెంటనే కౌషిక లో లైసెన్స్డ్ మద్యంషాపు ఏర్పాటు చేయాలని కోరారు.