
భారత రత్న, క్రికెట్ దేవుడు, రాజ్యసభ్యుడు సచిన్ టెండుల్కర్ కి గురువారం రాజ్యసభలో అవమానం జరిగింది. తొలిసారిగా సచిన్ గురువారం రాజ్యసభలో మాట్లాడాల్సి ఉంది. కాగా ఆయన మాట్లాడుతుంటే.. సభలోని కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆయన ప్రసంగానికి ఆటంకం కలిగించారు.
అసలు విషయం ఏమిటంటే.. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత సచిన్ తొలిసారిగా సభలో మాట్లాడే అవకాశం వచ్చింది. దీంతో సర్వత్రా ఆయన ప్రసంగంపై ఆసక్తి ఏర్పడింది. కాగా.. సచిన్ తన ప్రసంగాన్ని అలా మొదలుపెట్టారో లేదో.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన మొదలుపెట్టారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మన్మోహన్పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు తెలియజేయాలని వారంతా డిమాండ్ చేశారు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా, విద్యార్థుల ప్రధానమైన సమస్యపైనే సచిన్ రాజ్యసభలో సుదీర్ఘంగా ప్రసగించాల్సి ఉంది. ఇక సచిన్ ప్రసంగం అడ్డుకోవటంపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రపంచవేదికగా సచిన్ ఎంతో పేరు సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి సభలో మాట్లాడుతుంటే అడ్డుకోవటం సిగ్గు చేటు. పైగా ఆయన ప్రసంగించబోయే అంశం ఎంత కీలకమైందో ప్రతీ ఒక్కరికీ తెలుసు. సభ ఉంది కేవలం రాజకీయ నేతలు మాట్లాడేందుకే కాదు కదా.. అని ఎంపీ జయాబచ్చన్ అన్నారు.