గుప్త నిధుల తవ్వకాల్లో మరో ట్విస్ట్

First Published Dec 21, 2017, 4:12 PM IST
Highlights
  • కర్నూలు జిల్లాలో గుప్త నిధి తవ్వకాలు
  • ఆరు రోజులుగా కొనసాగుతున్న తవ్వకాలు

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లె కోటలో జరుగుతున్న గుప్త నిధుల తవ్వకాలో మరో ట్విస్ట్ వచ్చి చేరింది. గత ఆరు  రోజులుగా అధికారులు అక్కడ తవ్వకాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా... దీనిపై గురువారం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ స్పందించారు.

అసలు విషయం ఏమిటంటే.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లె గ్రామంలో ఉన్న కోట అంతర్బాగంలో ప్రాచీనమైన దేవాలయం ఉంది. పాడుబడిన ఈ కోటలో నిధులు నిక్షేపాలు ఉన్నాయన్న ప్రచారం కొన్నాళ్లుగా జోరుగా సాగుతోంది. దీంతో తవ్వకాలకు అంతులేకుండా పోతోంది. అధికారులే తవ్వకాలకు సిద్ధమవడమే కాదు రాత్రి పగలు తేడా లేకుండా కొనసాగిస్తుండటాన్ని చెన్నెంపల్లి గ్రామస్తులు వ్యతిరేకించారు. తవ్వకాలకు అనుమతి ఏదంటూ పత్రాలు చూపించాలంటూ అడ్డం తిరిగారు. దీంతో దిగివచ్చిన జిల్లా యంత్రాంగం గ్రామస్తులతో చర్చించి దొరికిన నిధుల నుంచి 20 శాతం గ్రామాభివృద్ధికి కేటాయిస్తామని హామినివ్వడంతో తవ్వకాలకు ఊరి ప్రజల అనుమతిచ్చారు.

కాగా.. ఈ తవ్వకాలను ప్రతిపక్ష పార్టీ నేతలు వ్యతిరేకించారు. దీనిపై జిల్లా కలెక్టర్ సత్యనారాయణకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ తవ్వకాలపై తమకు సమాధానం ఇవ్వాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేయగా.. కలెక్టర్ స్పందించారు. ప్రభుత్వ అనుమతితోనే ఈ తవ్వకాలు చేపట్టినట్లు చెప్పారు. మినరల్ యాక్ట్ సెక్షన్ 4 కింద ఈ తవ్వకాలను చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటి వరకు గుర్రపు ఎముకలు, ఏనుగు దంతాలు బయటపడ్డాయని కలెక్టర్ చెప్పారు. మైనింగ్, జియాలజీ అధికారులు పరిశోధనలు జరిపి  అక్కడ ఖనిజ నిక్షేపాలున్నట్లు గుర్తించారని కలెక్టర్ వివరించారు.

click me!