పాపం.. చంద్రబాబు మీద బెంగపెట్టుకున్నాడట

First Published Nov 10, 2017, 11:12 AM IST
Highlights
  • సీఎం చంద్రబాబుని కలిసిన నటుడు వేణుమాదవ్
  • జగన్ పై విమర్శలు చేసిన వేణుమాధవ్

హాస్య నటుడు వేణుమాధవ్... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బెంగపెట్టుకున్నాడట. అందుకే గురువారం సాయంత్రం వెలగపూడి వచ్చి మరీ సీఎంని కలిసి వెళ్లాడు.విషయం ఏమిటంటే.. వేణుమాధవ్ టీడీపీ అభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో చాలా సార్లు వేణుమాదవ్.. టీడీపీ ప్రభుత్వాన్ని పొగుడతూ.. ప్రతిపక్ష నేత జగన్ ని విమర్శించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.  నంధ్యాల ఉప ఎన్నిక సమయంలోనూ ఆయన తన గొంతు బాగానే వినిపించారు.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. ఏపీ సచివాలయానికి వచ్చిన వేణుమాధవ్ సుమారు అరగంటపాటు ముఖ్యమంత్రితో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘అకస్మాత్తుగా ఇలా వచ్చారేంటీ?’’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా..‘‘ చంద్రబాబుని కలిసి చాలా రోజులు అయ్యిందని, ఆయన మీద బెంగ పెట్టుకున్నానని.. అందుకే వచ్చికలిశాన’’ని  వేణుమాధవ్ సమాధానమిచ్చారు.  కేవలం చంద్రబాబు గురించి మాట్లాడితే.. ఆయన వేణుమాధవ్ ఎందుకు అవుతాడు? అందుకే పనిలోపనిగా జగన్ పై సెటైర్లు కూడా వేశారు. వైసీపీ అధినేత జగన్ ని చూస్తుంటే తనకు జాలేస్తోందని కూడా చెప్పారు. ఒకవైపు పాదయాత్రలు చేస్తూనే మరో వైపు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి జగన్ దని ఎద్దేవా చేశారు. ‘‘జగన్ చాలా కష్టపడుతున్నాడు.. ఆయన కష్టాన్ని ఎవరూ తీర్చేలేరంటూ’’ వేణుమాధవ్ విమర్శించారు.

ఇదిలా ఉండగా.. వేణుమాధవ్ కి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో.. ఆయనకు రాజకీయాలపై గాలిమల్లినట్లు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అందులోనూ తెలంగాణలో టీడీపీకి అభ్యర్థుల కొరత ఉంది. చాలా మంది నేతలు టీఆర్ ఎస్, కాంగ్రెస్ గూటిలోకి చేరిపోయారు. ఇక వేణుమాధవ్ కి సినీ నటుడిగా కాస్తో కూస్తో ఫాలోయింగ్ ఉంది. దీంతో.. వేణుమాధవ్ టీడీపీ తరపు నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారేమో అనే వాదనలు వినపడుతున్నాయి. ఇదే విషయంపై ప్రస్తుతం టీడీపీ శ్రేణులు చర్చలు జరుపుతున్నారు. అందుకే.. వేణుమాదవ్ పదేపదే ముఖ్యమంత్రిని కలుస్తున్నట్లు సమాచారం. నల్గొండ జిల్లాకు చెందిన వేణుమాధవ్.. అదే ప్రాంతం నుంచి పోటీ చేస్తారనే వాదనలు వినపడుతున్నాయి.

click me!