
మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ఈ బిల్లుకు ‘‘నారీశక్తి వందన్ ’’ అనే పేరు పెట్టారు. రేపు ఈ బిల్లుపై లోక్సభలో చర్చించనున్నారు. ఎల్లుండి రాజ్యసభలో బిల్లుపై చర్చించనున్నారు. కేంద్రం తీసుకొస్తున్న ఈ బిల్లు వల్ల ఇకపై మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో ఈ రిజర్వేషన్లు అమలవుతాయి. అయితే ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. ప్రస్తుత లోక్సభ , అసెంబ్లీలపై ఎలాంటి ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు. డీలిమిటేషన్ తర్వాతనే బిల్లును అమల్లోకి తీసుకొస్తారు. మరోవైపు.. మహిళా బిల్లు కాపీలను తమకు ఎందుకు ఇవ్వలేదంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి.
అంతకుముందు ప్రధాని మోడీ మాట్లాడుతూ.. గణేష్ చతుర్థి రోజున కొత్త పార్లమెంట్ లోకి అడుగు పెట్టామన్నారు. అజాదీ అమృత్ కాలంలో ఇది ఉషోదయ కాలంగా ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.కొత్త పార్లమెంట్ లో సభకు ఎంపీలందరినీ ఆహ్వానిస్తున్నామని ప్రధాని మోడీ చెప్పారు.ఆధునికతకు అద్దం పట్టడంతో పాటు చరిత్రను ప్రతిబింబించేలా కొత్త పార్లమెంట్ భవనం నిర్మించినట్టుగా మోడీ పేర్కొన్నారు. . అమృత కాలంలో కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నట్టుగా ప్రధాని మోడీ చెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమంలో సెంగోల్ది కీలక పాత్ర అని మోడీ గుర్తు చేశారు. నెహ్రు చేతికి శోభనిచ్చిన సెంగోల్ నేడు సభలో కొలువు దీరిందన్నారు.
Also Read: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నా: పార్లమెంట్ కొత్త భవనంలో మోడీ
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముందడుగు వేయబోతున్నామని ప్రధాని మోడీ చెప్పారు. నారీశక్తి బిల్లును చట్టం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని ప్రధాని స్పష్టం చేశారు.మహిళా రిజర్వేషన్ బిల్లుకు నారీశక్తి వందన్ అనే పేరు పెట్టినట్టుగా మోడీ పేర్కొన్నారు.కొత్త భవనంలో నారీశక్తిని బలోపేతం చేసేలా తొలి నిర్ణయం తీసుకోబోతున్నామని ప్రధాని మోడీ చెప్పారు.మహిళా రిజర్వేషన్ బిల్లును నిన్ననే కేంద్రం ఆమోదించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.అభివృద్ది ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం మరింత పెంచాలనుకుంటున్నామన్నారు.నారీశక్తి వందన్ తో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని మోడీ చెప్పారు. ఈ రోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.