
BJP Hindu Ekta Yatra: దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామనీ, బహుభార్యత్వం అంతమవుతుందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్ లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, లోక్ సభ ఎంపీ బండి సంజయ్ కుమార్ నిర్వహించిన 'హిందూ ఏక్తా యాత్రలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, తన ప్రసంగిస్తూ యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ), లవ్ జిహాద్, మదర్సాలు వంటి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అసోంలో ఈ ఏడాది మరో 300 మదర్సాలను మూసివేస్తామని కూడా చెప్పారు. ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు వరుసగా తెలంగాణ పర్యటనలకు వస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నిర్వహించే కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.
మన నాగరికత, సంస్కృతికి ముప్పు సృష్టిస్తున్నారు..
అసోంలో లవ్ జిహాద్ ను అరికట్టేందుకు కృషి చేస్తున్నామని చెప్పిన హిమంత బిశ్వశర్మ.. రాష్ట్రంలోని మదర్సాలను మూసివేసేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక అసోంలో 600 మదర్సాలను మూసివేసినట్టు తెలిపారు. ఈ ఏడాది మరో 300 మదర్సాలను మూసివేస్తానని ఓవైసీకి చెప్పాలనుకుంటున్నానంటూ వ్యాఖ్యలు చేశారు. మార్చిలో 600 మదర్సాలను మూసివేశాననీ, వాటికి బదులుగా కళాశాలలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను నిర్మించాలని అనుకుంటున్నందున వాటన్నింటినీ మూసివేయాలని అనుకుంటున్నట్లు శర్మ చెప్పారు. అంతకుముందు, బెల్గావిలో 'శివ చరితే' పేరిట ఏర్పాటు చేసిన ర్యాలీలో శర్మ మాట్లాడుతూ.. "బంగ్లాదేశ్ నుంచి ప్రజలు అస్సాంకు వచ్చి మన నాగరికతకు, సంస్కృతికి ముప్పు సృష్టిస్తున్నారు. నేను 600 మదర్సాలను మూసివేశాను. మాకు మదర్సాలు వద్దు కాబట్టి అన్ని మదర్సాలను మూసివేయాలని అనుకుంటున్నాను. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు కావాలి మనకు" అని అన్నారు.
యూసీసీ దేశంలో అమలు చేస్తాం..
దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేస్తామని, బహుభార్యత్వం అంతమవుతుందని శర్మ చెప్పారు. "భారత్ లో కొందరు నలుగురు మహిళలను పెళ్లి చేసుకోవచ్చని భావించారు. ఇదీ వారి ఆలోచన. కానీ, మీరు నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేరని నేను చెబుతున్నాను. ఆ రోజులు ముగియబోతున్నాయి. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) భారతదేశంలో రాబోతోందని, భారతదేశాన్ని నిజమైన లౌకిక దేశంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైంది" అని హిమంత బిశ్వశర్మ అన్నారు. బహుభార్యత్వాన్ని అంతమొందించేందుకు చట్టం చేయడానికి రాష్ట్ర శాసనసభ శాసన సామర్థ్యాన్ని పరిశీలించడానికి శర్మ ఇప్పటికే నలుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు.
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం 'రజాకార్ రాజ్యం' నుంచి రామరాజ్యంగా మారుతుందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు. కరీంనగర్ లో జరిగిన 'హిందూ ఏక్తా యాత్ర'కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ నుంచి యాత్ర ప్రారంభమైంది.