
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో రోడ్డుపై నమాజ్ చేశారని 2,000 మందిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. గత వారం రంజాన్ నాడు ఈద్గా బయట రోడ్డుపై అనుమతి లేకుండా నమాజ్ చేశారని కేసు ఫైల్ చేసినట్టు పోలీసులు గురువారం వెల్లడించారు. మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
బజారియా, బాబు పర్వా, జజ్మావ్ పోలీసు స్టేషన్లలో బుధవారం ఈ మూడు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. రోడ్డు పై నమాజ్ చేస్తున్న వారిని పోలీసులు వీడియో తీశారు.
ఆ వీడియో ఆధారంగా రోడ్డుపై నమాజ్ చేసిన వారిని గుర్తిస్తామని, ఆ తర్వాత వారిపై లీగల్ యాక్షనర్్ తీసుకుంటామని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ పోలీసు అధికారి తెలిపారు.
పోలీసుల చర్యలపై ముస్లిం పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. మతం ఆధారంగా తమను టార్గెట్ చేస్తున్నారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు మొహమ్మద్ సులేమాన్ అన్నారు. కొంత మంది ఈద్గా వెలుపల రోడ్డుపై నమాజ్ చేశారని, ప్రార్థనలకు వారు ఆలస్యంగా రావడం, ఈద్గా లోపల స్థలం లేకపోవడం వంటి కారణాలతో వారు బయట నమాజ్ చేశారని వివరించారు.
Also Read: భార్య బర్త్డేకు కేక్ కొనివ్వడానికి ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్కు కోర్టు అనుమతి
బజారియా పోలీసు స్టేషన్లో వేయి నుంచి 1,500 వరకు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో కొందరు ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులూ ఉన్నారు. సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ ఓంవీర్ సింగ్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. ఈద్ కోసం పిలుపు రాగానే చాలా మంది 144 సెక్షన్ ఉల్లంఘిస్తూ రోడ్డుపైనే నమాజ్ చేశారని ఆయన ఆరోపించారు.
కాగా, జజ్మావ్ పోలీసు స్టేషన్లో సుమారు 300 మందిపై, బాబు పర్వా పోలీసు స్టేషన్లో సుమారు 50 మందిపై ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై నమాజ్ చేసినందుకు కేసు నమోదైంది.
ఈద్ ప్రార్థనలపై పీస్ కమిటీలతో సమావేశమైన తర్వాత గైడ్లైన్స్ విడుదల చేసిన మరో పోలీసు అధికారి తెలిపారు. వీధుల్లో ప్రార్థనాలు చేయరాదని కచ్చితమైన సూచనలు చేశామని వివరించారు.