
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పశ్చిమ బెంగాల్ మరోసారి రణరంగంగా మారింది. హౌరా నగరంలో జరిగిన శోభాయాత్రలో అల్లర్లు, హింస చోటు చేసుకుంది. దీనిపై కేంద్రం అప్రమత్తైంది. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందర్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీశారు. శ్రీరామ శోభాయాత్ర సందర్భంగా హౌరాలో గురువారం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా వాహనాలను తగులబెట్టడం, రాళ్లు రువ్వడం, దుకాణాలను లూటీ చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసు వాహనాలు కూడా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బెంగాల్ గవర్నర్ అల్లర్లు జరిగిన ప్రాంతంలో పర్యటించి పరిస్ధితిని అమిత్ షాకు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు రంగంలోకి దిగారు. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి 36 మందిని అదుపులోకి తసీుకున్నారు.
మరోవైపు ఈ అల్లర్లపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. హౌరాలో చోటు చేసుకున్న హింసాకాండకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఇతర మితవాద సంస్థలే కారణమని ఆమె అన్నారు. ఈ అల్లర్లలో ఆస్తులు కోల్పోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, ఈ ప్రాంతంలో శాంతిని కాపాడాలని మమతా బెనర్జీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Also REad: హౌరాలో హింసాకాండ వెనుక బీజేపీ హస్తం - పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
హౌరా ఘటన చాలా దురదృష్టకరం. హౌరాలో జరిగిన హింసాకాండ వెనుక హిందువులు, ముస్లింలు లేరు. బీజేపీతో పాటు భజరంగ్ దళ్, ఇతర సంస్థలు ఆయుధాలతో హింసకు పాల్పడుతున్నాయి’’ అని మమతా బెనర్జీ ‘ఏబీపీ ఆనంద’తో అన్నారు. హౌరాలో జరిగిన హింసాత్మక ఘర్షణలకు సంబంధించి దాదాపు 31 మందిని అరెస్టు చేసినట్లు మమతా బెనర్జీ తెలిపారు. ఈ ఘటనలకు అడ్మినిస్ట్రేటివ్ లోని ఓ విభాగం అలసత్వమే కారణమని ఆమె ఆరోపించారు. మమతా బెనర్జీ ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ నేత సువేందు అధికారి స్పందించారు. హింసాకాండకు ముఖ్యమంత్రి, రాష్ట్ర అధికార యంత్రాంగం బాధ్యత వహించాలని అధికారి అన్నారు.
అదేవిధంగా గుజరాత్ లోని వడోదరలో గురువారం శ్రీరామనవమి సందర్భంగా ఫతేపురా ప్రాంతంలో జరిగిన ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల ప్రజలు రాళ్లు రువ్వుకున్నారు. వాహనాలు కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉందని పోలీసులు తెలిపారు. గతంలో వడోదరలోని కుంభర్వాడ ప్రాంతంలో ఊరేగింపు సందర్భంగా కూడా ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి.