
రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి కేంద్రం షాకిచ్చింది. రాష్ట్రాలకు తాము వ్యాక్సిన్ సరఫరా చేయలేమని చేతులెత్తేసింది. రాష్ట్రాలే సొంతంగా వ్యాక్సిన్ కొనుగోలు చేసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ సరఫరా చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సహా మరికొన్ని రాష్ట్రాలను కేంద్రాన్ని కోరాయి. ఇలాంటి పరిస్ధితుల్లో కేంద్రం నిర్ణయం వెలువరించింది.
కాగా.. భారత్ లో కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనారోగుల సంఖ్య మరోసారి ప్రజల్లో భయాందోళనలు కలుగుజేస్తోంది. గత వారం నుంచి నిత్యం వేయికి పైగా కొత్త కేసులు నమోదవుతు కోవిడ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 6,050 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 13 శాతం అధికమని కోవిడ్ గణాంకాలు పేర్కొంటున్నాయి.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో కొత్తగా 6 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో శుక్రవారం 6,050 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, ఇది నిన్నటి 5,335 ఇన్ఫెక్షన్ల సంఖ్యతో పోలిస్తే 13 శాతం ఎక్కువ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది. కొత్త కేసులు పెరుగుదల కారణంగా దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు 28,303కు చేరుకుంది. ఇదే సమయంలో కోవిడ్-19 తో పోరాడుతూ మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా వైరస్ కారణంగా మొత్తం 5,30,943 మంది మరణించారు.
ALso Read: కోవిడ్ పంజా: ఒకే రోజు 6 వేలకు పైగా కొత్త కేసులు..పెరుగుతున్న మరణాలు
కోవిడ్ బారినపడ్డవారితో పాటు కోలుకుంటున్న వారి సంఖ్య సైతం అధికంగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. ఇప్పటివరకు మొత్తం 4,41,85,858 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక వ్యాక్సినేషన్ విషయానికొస్తే గత 24 గంటల్లో 2,334 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. జనవరి 16, 2021 న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 2,20,66,20,700 టీకాలు వేసినట్టు ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. కేసులు క్రమంగా పెరుగుతుండటంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైద్య నిపుణులు కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు.
రాష్ట్రాల వారీగా చూస్తూ మహారాష్ట్రలో కొత్త కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇక్కడ 803 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది బుధవారం సంఖ్యతో పోలిస్తే 234 పెరిగింది. మరో ముగ్గురు పేషెంట్లు ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 216 కేసులు నమోదు కాగా, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఒక మరణం నమోదైనట్లు బులెటిన్ లో పేర్కొన్నారు. థానే నగరం, జల్నా జిల్లాలో కరోనా వైరస్ సంబంధిత మరో రెండు మరణాలు సంభవించాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.