కరుణానిధి అంత్యక్రియల వివాదం: ప్రజల సెంటిమెంట్ ని పట్టించుకోరా..?

First Published Aug 8, 2018, 9:45 AM IST
Highlights

మాజీ ముఖ్యమంత్రులుగా ఉండి కన్నుమూసిన వారికి మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించిన దాఖలాలు గతంలో లేవని పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి కామరాజ్‌ నాడార్‌ చనిపోయినప్పుడు డీఎంకే అధికారంలో ఉందని.. ఆయనకు అంతిమ సంస్కారాలకు మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించలేదని గుర్తుచేసింది. 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పార్థివదేహానికి అంత్యక్రియలు జరిపే స్థల వివాదంపై హైకోర్టులో బుధవారం ఉదయం వాద ప్రతివాదనలు కొనసాగుతున్నాయి. రుణానిధి అంతిమ సంస్కారాలు మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాధి పక్కన నిర్వహించేందుకు స్థలం కేటాయించాలని డీఎంకే చేసిన విజ్ఞప్తిని తమిళనాడు ప్రభుత్వం తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీనిపై డీఎంకే నిన్న రాత్రి హైకోర్టును ఆశ్రయించింది. ఈ అత్యవసర వ్యాజ్యంపై హైకోర్టు అర్థరాత్రి విచారణ చేపట్టింది. ఈరోజు ఉదయం 8 గంటల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.


దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం హైకోర్టుకు వివరణ ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రులుగా ఉండి కన్నుమూసిన వారికి మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించిన దాఖలాలు గతంలో లేవని పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి కామరాజ్‌ నాడార్‌ చనిపోయినప్పుడు డీఎంకే అధికారంలో ఉందని.. ఆయనకు అంతిమ సంస్కారాలకు మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించలేదని గుర్తుచేసింది. 

అన్నాదురై, ఎంజీఆర్‌, జయలలిత ముఖ్యమంత్రులుగా కన్నమూసినందునే వారికి మెరీనా బీచ్‌లో దహన సంస్కారాలకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని హైకోర్టుకు తెలిపింది. కరుణానిధికి స్థలం కేటాయించడానికి తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి ప్రత్యామ్నాయంగానే కరుణానిధి అంతిమ సంస్కారాలకు గిండిలో 2ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించింది.

అయితే.. దీనిపై డీఎంకే తరపు న్యాయవాది కాస్త ఘాటుగానే స్పందించారు. ప్రజల సెంటిమెంట్ ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. ప్రజల సెంటిమెంట్ కన్నా.. ప్రోటోకాలే ముఖ్యమా అని నిలదీశారు. మెరీనా బీచ్ లో మాజీ సీఎం అంత్యక్రియలకు నిషేధం లేదని డీఎంకే తరపు న్యాయవాది వాదించారు. కాగా.. మరికొద్ది సేపట్లో న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.

click me!