
యూపీలోని అన్ని మతపరమైన ప్రదేశాల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించినందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ను మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే గురువారం అభినందించారు. మతపరమైన ప్రదేశాల నుంచి ముఖ్యంగా మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించినందుకు యోగి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని రాజ్ థాకరే ట్వీట్ చేశారు.‘‘ యోగులు (సన్యాసులు) మహారాష్ట్రలో కనిపించరు, కానీ ‘భోగులు’ (హెడోనిస్టులు) మాత్రమే కనిపిస్తారు’’ అని రాజ్ ఠాక్రే అన్నారు.
మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ల వివాదం మొదలైన సమయంలోనే యూపీలో కూడా చాలా చోట్ల ఇదే విషయంలో ఆందోళనలు జరిగాయి. దీంతో పాటు హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీలో హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మతపరమైన ప్రదేశాల్లో వీటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో లౌడ్ స్పీకర్లను తొలగించే ప్రక్రియను అక్కడి అధికారులు ప్రారంభించారు. బుధవారం సాయంత్రానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు దాదాపు 11,000 లౌడ్ స్పీకర్లను మతపరమైన భవనాల నుంచి తొలగించారు.
యుపీ ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మతపరమైన ప్రదేశాల నుండి మొత్తం 10,923 లౌడ్ స్పీకర్లను తొలగించారు. బుధవారం సాయంత్రం 4.00 గంటల వరకు పారామీటర్లకు అనుగుణంగా 35,221 లౌడ్ స్పీకర్ల పరిమాణాన్ని సర్దుబాటు చేశారు. ఆగ్రా, మీరట్, బరేలీ, లక్నో, కాన్పూర్, ప్రయాగ్రాజ్, గోరఖ్ పూర్, వారణాసి, కాన్పూర్, గౌతమ్ బుద్ధ నగర్ తో పాటు నాలుగు కమిషనరేట్ల నుంచి లౌడ్ స్పీకర్లను రాష్ట్ర హోం శాఖ తొలగించింది.
అయితే గత నెలలో ఈ లౌడ్ స్పీకర్ల వివాదాన్ని మహారాష్ట్రలో ఎమ్ఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే ప్రారంభించారు. మే 3వ తేదీ లోగా రాష్ట్రంలోని మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై పార్టీలో ప్రచారం కూడా మొదలైంది. ఈద్ తర్వాత కూడా అంటే మే 3 తర్వాత కూడా మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించకుంటే తమ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వానికి రాజ్ థాకరే అల్టిమేటం ఇచ్చారు. రాజ్ థాకరే అల్టిమేటం మహారాష్ట్ర రాజకీయాలను ఉధృతం చేసింది.
దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ వివాదం నెలకొంది. కానీ మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం రాజ్ ఠాక్రే డిమాండ్ ను తిరస్కరించింది. ఈ బంతిని కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి విసిరింది. మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వాడకంపై జాతీయ విధానాన్ని కోరింది. అయితే లౌడ్ స్పీకర్లను వినియోగించేటప్పుడు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, సరైన డెసిబెల్స్ స్థాయిలోనే సౌండ్ ఉండాలని చెప్పింది. వీటిని ఉల్లంఘిస్తే శిక్ష ఎదుర్కొంటారని అన్ని మత ప్రార్థనా స్థలాలకు ప్రభుత్వం స్పష్టం చేసింది.సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అనేక మసీదులు, ఇతర మతపరమైన ప్రదేశాలు ఇప్పటికే తమ లౌడ్ స్పీకర్ వాల్యూమ్ లను తగ్గించడం ప్రారంభించాయి.