
బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలను లక్ష్యంగా చేసుకోవడానికే కోవిడ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇంధన ధరల అంశం ప్రస్తావించారని శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించారు.
పెరుగుతున్న కోవిడ్ ఇన్ ఫెక్షన్లపై ప్రధాని మోడీ బుధవారం సమావేశం నిర్వహిస్తారని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెప్పారని అన్నారు. కానీ భేటీలో మాత్రం ట్రాక్ మార్చి పెట్రోల్, డీజిల్ పై చర్చ ప్రారంభించారని తెలిపారు. ప్రధాని బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలను టార్గెట్ చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఇలా చేయడం సరికాదని తెలిపారు. ఆయన ఇలా చేస్తారని ఊహించలేదు చెప్పారు. ఈ సమావేశం ఏకపక్ష ఏకపాత్రాభినయమని ఎద్దేవా చేశారు. ఇంధన ధరలపై ఇందులో చర్చలు అస్సలు అవసరం లేదని తెలిపారు. అయితే ఈ సమావేశంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రేచ మమతా బెనర్జీ సమాధానం ఇచ్చారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీ, బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు.
ఈ మీడియా సమావేశం సందర్భంగా బీజేపీపై తీవ్రంగా సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. ఏప్రిల్ 30వ తేదీన ముంబైలో శివసేన ర్యాలీ నిర్వహించనుందని తెలిపారు. అనంతరం ఆయన నవనీత్ రాణా గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఆమెకు అండర్ వరల్డ్తో ఆర్థిక సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. సంజయ్ రౌత్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిష్క్రియాత్మకత, బీజేపీ మౌనాన్ని ప్రజలు గమనించారని అన్నారు. “ శరద్ పవార్ యూసుఫ్ లకడావాలాతో ఉన్న ఫొటోలను బీజేపీ చూపించింది. అయితే అతను ఎవరితో ఆర్థిక లావాదేవీలు జరిపాడన్నదే అసలు ప్రశ్న’’ అని ఆయన అన్నారు.
‘‘ బీజేపీ వద్ద సమాధానాలు లేవు కాబట్టి వారు ఫొటోలను వారు చూపుతున్నారు. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ స్కామ్లో అరెస్టయిన వ్యక్తితో ఆర్థిక లావాదేవీలు జరిపిన వారిని ఈడీ ఎందుకు పిలిపించలేదు. నేటి కాలంలో ఎవరైనా, ఏ ఫంక్షన్లోనైనా, ఏ నాయకుడితోనైనా ఫొటోలు తీసుకోవచ్చు’’ అని సంజయ్ రౌత్ అన్నారు.
ఇటీవల పెరుగుతున్న కోవిడ్ కేసులు, రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోడీ బుధవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించారు. అయితే ఇందులో పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్ ప్రస్తావనలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం గత నవంబర్లో ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని గుర్తుచేశారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే ఇంధన ధరలు తగ్గుతాయని చెప్పారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలు ఇంధనంపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించాలని ఆయన అభ్యర్థించారు. వ్యాట్ను తగ్గించిన రాష్ట్రాల్లో ఇంధన ధరలు తక్కువగా ఉన్నాయని సూచించారు.
పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించాలని రాష్ట్రాలను కేంద్రం గతంలోనే అభ్యర్థించిందని చెప్పారు. అయితే తాను ఎవరినీ విమర్శించడం లేదని, కేవలం చర్చిస్తున్నానని ప్రధాన మోడీ అన్నారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించి ప్రజలకు ప్రయోజనాలు అందించాలని కోరారు. అయితే ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీయేతర రాష్ట్రాల నాయకులు స్పందించారు.