
న్యూఢిల్లీ: భానుడి భగ భగలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. సూర్యుడి సెగలతో చాలా చోట్ల వడగాలులు భయంకరంగా వీస్తున్నాయి. భారత్ గతంలో ఎన్నడూ చూడనంత వేడిగా ఈ వేసవి ఉండబోతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాలు 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు చేస్తున్నాయి. తాజాగా, భారత వాతావరణ శాఖ వడగాలులపై ఐదు రాష్ట్రాలకు వార్నింగ్ ఇచ్చింది.
రానున్న కనీసం ఐదు రోజులు భారత్లోని అధిక భాగంలో భయంకర వడగాలులు వీస్తాయని ఇండియా మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ అంచనా వేసింది. ముఖ్యం వాయవ్య భారతంలో వచ్చే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీల సెల్సియస్లు పెరుగుతాయని తెలిపింది. ఆ తర్వాత ఆ పెరిగిన రెండు డిగ్రీల సెల్సియస్లు పడిపోవచ్చని వివరించింది. ముఖ్యంగా రాజస్తాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశాలకు ఐఎండీ వడగాలులపై వార్నింగ్ ఇచ్చింది. ఈ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు ఇప్పటికే 45 డిగ్రీల సెల్సియస్లకు మించి టెంపరేచర్లు నమోదు చేస్తున్నాయని వివరించింది. ఈ కఠిన పరిస్థితులు మే తొలివారం వరకూ ఉండొచ్చని ఐఎండీ సైంటిస్టు ఆర్కే జెనామని తెలిపారు.
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్లు దాటుతున్నాయి. మధ్యభారతంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలే ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఢిల్లీలోనూ టెంపరేచర్ పీక్స్కు వెళ్తున్నది. ఈ రోజు కూడా ఇక్కడ హీట్ వేవ్ ముప్పు ఉన్నదని వివరించింది. ఈ రోజు టెంపరేచర్ 43 డిగ్రీలను తాకొచ్చని, శుక్రవారం నాటికి ఈ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్కు చేరవచ్చని తెలిపింది.
జమ్ము కశ్మీర్లోనూ వేసవి తాపం తీవ్రంగా ఉన్నది. జమ్ములోనూ 40 డిగ్రీల సెల్సియస్ల టెంపరేచర్ రికార్డ్ కావడం గమనార్హం. ఒడిశాలోనైతే వరుసగా మూడు రోజులుగా టెంపరేచర్ 40 డిగ్రీలను క్రాస్ చేసింది. హీట్ వేవ్ కారణంగా రాష్ట్రంలోని అన్ని స్కూల్స్ను ఏప్రిల్ 30వ తేదీ వరకు మూసేశారు. పొరుగు రాష్ట్రం పశ్చిమ బెంగాల్ కూడా మండే ఎండలను దృష్టిలో పెట్టుకుని స్కూల్స్, కాలేజీలకు ముందస్తుగానే సమ్మర్ హాలీడేస్ ప్రకటించింది. మే 2వ తేదీ వరకు వాటిని మూసేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.
గత 122 ఏళ్లలో వాయవ్య భారతం మార్చిలో అత్యధిక ఉష్ణోగ్రతలను నమోదు చేసింది.