
తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా అన్నారు. ఎనిమిదేళ్లుగా నిరంతరం నిజాయితీతో పనిచేసినా అవినీతి ఆరోపణలు రావడం దురదృష్టకరమని తెలిపారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తూ మంగళవారం విడుదల చేసిన లేఖలో ఆయన ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేశారు. అందులో ఆయనపై వచ్చిన ఆరోపణలను తప్పుబట్టారు.
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రాసిన లేఖలో ‘‘ఎనిమిదేళ్లుగా నిజాయితీగా పనిచేసినా నాపై అవినీతి ఆరోపణలు రావడం దురదృష్టకరం. ఈ ఆరోపణలన్నీ అబద్ధమని నాకు, నా దేవుడికి తెలుసు. నిజానికి ఈ ఆరోపణలు పిరికి, బలహీనుల కుట్ర తప్ప మరొకటి కాదు. వారి టార్గెట్ నేను కాదు, మీరు (కేజ్రీవాల్) వారి టార్గెట్ గా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు ఢిల్లీ మాత్రమే కాదు యావత్ దేశ ప్రజలు మిమ్మల్ని దేశం పట్ల విజన్ ఉన్న నాయకుడిగా చూస్తున్నారు. ప్రజల జీవితాల్లో పెద్ద మార్పులను తీసుకురాగల సామర్థ్యం మీలో ఉంది” అని పేర్కొన్నారు.
ఢిల్లీ కేబినెట్లోకి ఇద్దరు కొత్త మంత్రులు.. అతిషి, సౌరభ్ల పేర్లను ఎల్జీకి పంపిన కేజ్రీవాల్..!
కాగా.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, ఢిల్లీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ మంగళవారం రాష్ట్ర మంత్రివర్గంలోని తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు. వాటిని ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనాకు పంపనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. మరుసటి రోజు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఆయనకు ఐదు రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే ఎక్సైజ్ పాలసీ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ మనీష్ సిసోడియా వేసిన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ దశలో పిటిషన్ను స్వీకరించడానికి కోర్టు మొగ్గు చూపడం లేదని, సిసోడియాను ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.
పార్టీ విస్తరణపై కేసీఆర్ ఫోకస్: మహరాష్ట్రలో కోఆర్డినేటర్ల నియామకం
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతి ఆరోపణలపై తీహార్ జైలులో ఉన్న సత్యేందర్ జైన్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రశ్నించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జైన్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో మరో ఢిల్లీ కేబినెట్ మంత్రి, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో కలిసి ఆయన పేరు తెరపైకి వచ్చింది. సంబంధిత న్యాయవాదుల ప్రకారం ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ఈడీ కేసుకు సంబంధించి తీహార్ జైలులో ఉన్న విజయ్ నాయర్ను కూడా సీబీఐ ప్రశ్నించిందని ‘ఎన్డీటీవీ’ నివేదించింది. నాయర్కు సీబీఐ కేసులో గతంలో ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా.. ఇటీవల, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతి ఆరోపణలపై సీబీఐ, ఈడీ పలువురిని అరెస్టు చేశాయి.